ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ లిఫ్ట్ కు కృష్ణాబోర్డు-జగన్ సర్కార్ షరతు ఇదే
ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చురేపుతున్న వివాదాస్పద రాయలసీమ లిఫ్ట్ ను సందర్శించేందుకు కృష్ణా రివర్ బోర్డును ఏపీ ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ లిఫ్ట్ ను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కృష్ణా రివర్ బోర్డు సభ్యులు త్వరలో రాయలసీమ లిఫ్ట్ కు వెళ్లి పరిశీలించనున్నారు.
ఏపీ ప్రభుత్వం సహకారం లేకుండానే రాయలసీమ లిఫ్ట్ పరిశీలనకు వెళ్లేందుకు సిద్దమవుతున్న కృష్ణా రివర్ బోర్డు సభ్యులు.. ప్రభుత్వానికి మాత్రం అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము ఏ రోజు అక్కడికి వెళ్తున్నామో, ఏయే అంశాలు పరిశీలిస్తామన్న విషయాలపై వారు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణతో వివాదం నేపథ్యంలో వీరి పర్యటనకు ఓ కీలక షరతు విధించింది. దీనిపై వారు హామీ ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ కు వచ్చే అవకాశముంది.
రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తులెవరినీ తమ పర్యటనలో తీసుకురావొద్దని జగన్ సర్కార్ కృష్ణా రివర్ బోర్డుకు షరతు విధించినట్లు తెలుస్తోంది. గతంలో కృష్ణా రివర్ బోర్డు పర్యటనకు జగన్ అనుమతించకపోతే తామే హెలికాఫ్టర్ ఇచ్చి పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాయలసీమ లిఫ్ట్ కు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం తమ అధికారుల్ని కృష్ణా రివర్ బోర్డు సభ్యులతో కలిపి లిఫ్ట్ వద్దకు పంపుతుందన్న సమాచారంతో ఏపీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.