కృష్ణా మిగులు జలాలు రాయలసీమకే: బాబు
విజయవాడ: కృష్ణా నది మిగులు జలాలను రాయలసీమకే కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ఎత్తిపోతల వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15 నుంచి పోలవరం లిఫ్ట్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రాజెక్టు పురోగతిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ఫిబ్రవరి-జూన్ మధ్య నీరు-చెట్టు కార్యక్రమంపై దృష్టిసారించాలని ఇరిగేషన్ అధికారులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె, శిద్దా, ప్రతిపాటి, రావెల కిషోర్బాబు, దేవినేని ఉమా, రవీంద్ర, పీతల సుజాత, నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటన విశేషాలను సమావేశంలో చంద్రబాబు వివరించారు.
నష్టాల ఉబిలో చిక్కుకున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన వంద బస్సులను చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి సమయం పడుతుందన్నారు.