ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో మొదలైన జల వివాదం చిలికి చిలికి గాలివానగా తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, జల చౌర్యం, అక్రమ జల విద్యుత్ ఉత్పత్తి అంటూ రకరకాల అంశాలపై కొనసాగుతోంది. ఎవరూ తగ్గకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులను కొనసాగిస్తున్నారు. ఒకరు చేసిన తప్పులు మరొకరు ఏకరువు పెడుతున్నారు. చాలా కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వాటర్ వార్ పరిష్కారం కాకపోవటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టడానికి కేంద్రం రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది, గోదావరి నది యాజమాన్య బోర్డులను కేంద్రం అధీనంలోకి తీసుకువస్తూ గెజిట్ జారీచేసింది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఏమాత్రం మారలేదు. తాజాగా మరో కొత్త పంచాయితీ తెలుగు రాష్ట్రాల మధ్యలో చోటుచేసుకుంది.
తెలంగాణాను వదిలిపెట్టని ఏపీ, కృష్ణా రివర్ బోర్డుకు షాకింగ్ లేఖ, నదీ జలాల పంపిణీపై ట్విస్ట్ !!
తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ పనులను ఆపెయ్యాలని తెలంగాణా లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించినదని, అనుమతి లేకుండా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాసింది. వెంటనే ఆ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేసేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన కృష్ణానది యాజమాన్య బోర్డు వెలిగొండ ప్రాజెక్టుతో పాటు తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తక్షణమే సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఏపీ సర్కార్ ను డీపీఆర్ లు కోరిన కృష్ణా బోర్డు లేఖ
కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ చేసిన ఫిర్యాదు లేఖను కూడా లేఖతో పాటు జతపరిచి ఏపీకి పంపించారు. మరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంపించిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడకుండా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.
గతంలో హంద్రినీవా నీటి వాడకంపై ఫిర్యాదు
హంద్రీనీవా ప్రాజెక్టు నీటి వాడకం పై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది నుండి బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును బచావత్ ట్రిబ్యునల్ అనుమతించలేదని పేర్కొంది . నీటిని ఆ విధంగా తరలించడం వల్ల బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతున్నాయని కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని తెలంగాణా ప్రభుత్వం ఆ లేఖ ద్వారా కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు రాయలసీమ ప్రాజెక్ట్ చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అంటూ ఆధారాలతో సహా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు వెలిగొండ ప్రాజెక్ట్, తెలుగు గంగ ప్రాజెక్ట్ ల విస్తరణపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
ఏపీ సర్కార్ కూడా తెలంగాణా ప్రాజెక్ట్ లపై ఫిర్యాదు
ఏపీ సర్కార్ కూడా కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అన్న చందంగా తెలంగాణా అక్రమ ప్రాజెక్ట్ లపై, జల దోపిడీపై, జల విద్యుత్ ఉత్పత్తిపై కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించటంలో కృష్ణా బోర్డు విఫలం అవుతూనే ఉంది. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో లేవని తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారంలో కేంద్రం గెజిట్ జారీ చేసి నదీ జలాల విషయంలో కేంద్రం పరిధికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినా, తాజా సమస్యల పరిష్కారం సూచించకుండా కేంద్రం తమాషా చూస్తుంది.
జలవివాదాల పరిష్కారానికి జరిగిన ఉమ్మడి బోర్డుల భేటీలోనూ రగడ
ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ జల సౌధాలో తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ, శ్రీశైలం ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరించిందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఢిల్లీలో సీఎం కేసీఆర్ .. జలవివాదాలు అసలు పరిష్కారం అవుతాయా ?
ఈ ఏడాది నీటి పంపిణీ 50: 50 గా పంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గతంలో నీటి వాటాలు ఏ విధంగా ఉన్నాయో అవే కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలవిద్యుత్తు ఉత్పత్తి కంటే, తాగునీటి సాగునీటి ప్రయోజనాలే ముఖ్యమని, జల విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బోర్డు మీటింగ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హస్తినలో తేల్చుకుంటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ లో మకాం వేసి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణాల నదీ జలాల విషయంలో ఏం చెయ్యబోతున్నారో అన్న కొత్త చర్చ జరుగుతుంది.