చంద్రబాబు పుంగనూరు వచ్చేయండి- ఆరోగ్యం జాగ్రత్త : ఎన్టీఆర్ ఫ్యామిలీకి పార్టీ ఇచ్చేయాలి : పెద్దిరెడ్డి..!!
కుప్పంలో విజయం సాధించటంతో అక్కడ గెలుపు బాధ్యత తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి సీఎం జగన్ ను కలిసారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రిని ప్రశంసించారు. కుప్పం ఫలితాల పైన చర్చించారు. సొంత నియోజకవర్గంలోనే మూలాలు పోయిన తర్వాత ఇంకా చంద్రబాబు కొనసాగటం కరెక్ట్ కాదని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ ఆయనది కాదన్నారు. చంద్రబాబు తప్పుకుని పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించడం మంచిదని సూచించారు.

పుంగనూరులో పోటీ చేస్తే ఆహ్వానిస్తా
చంద్రబాబు పుంగనూరు వచ్చి పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తానన్నారు. తన మీద పోటీ చేసి ఓడించాలని సవాల్ చేసారు. సీఎం జగన్ పాలకు సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పట్టారని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోంది కాబట్టే.. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ భూస్థాపితమైందన్నారు. కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, హైదరాబాద్కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.

టీడీపీ ఓటమికి సాకులు వెతికే పనిలో
కుప్పం వచ్చి చంద్రబాబు, లోకేష్ నోటికి వచ్చినట్టుగా మాట్లాడారని, ఎవరైనా మా గురించి చెడ్డమాటలు మాట్లాడితే.. దానికి ఏ విధంగా స్పందిస్తానో మున్ముందు నీకే తెలుస్తుందని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఓటమికి సాకులు వెతికే పనిలో చంద్రబాబు ఉన్నారని, ప్రజా తీర్పును గౌరవించడం చేతగాని చంద్రబాబు.. దొంగ ఓట్లు వేయించారని మరోసారి వైయస్ఆర్ సీపీ మీద బురదజల్లడానికి ప్రయత్నిస్తాడన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా దౌర్జన్యం చేసిందో రాష్ట్రమంతా చూసిందన్నారు.

చంద్రబాబు చేసిన పనికి సంతోషం
విజయవాణి హైస్కూల్ను మొత్తం ధ్వంసం చేసి.. అక్కడున్న మహిళలపై దాడి చేశారన్నారు. దౌర్జన్యకాండను అడ్డుకొని ఎన్నికలు జరిగాయి కాబట్టే టీడీపీ పరాజయం పాలైందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు గెలిచారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ విజయం సాధించిందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. కుప్పం మున్సిపల్ కౌంటింగ్కు స్పెషల్ ఆఫీర్ను నియమించి, కౌంటింగ్ను రికార్డు చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చారని, అందుకు వైయస్ఆర్ సీపీ సంతోషిస్తుందన్నారు.

చంద్రబాబు పార్టీ వీడాలి
ప్రజలంతా ఛీ కొట్టిన తరువాత కూడా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడుతాడని అనుకోవడం లేని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కొని.. ఆ పార్టీని సున్నాకు తీసుకువచ్చాడని, సొంత నియోజకవర్గంలోనే పార్టీ మూలాలు లేకుండా చేసుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగడం హేయంగా ఉంటుందన్నారు. ఇకనైనా తప్పుకొని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. వయస్సు రీత్యా కూడా ఆలోచన చేసి తక్షణమే హైదరాబాద్కు పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications