kurnool assembly constituency: ముస్లింల అడ్డాలో వైసీపీ-టీడీపీ హోరాహోరీ- 4 వేల మెజార్టీ గొప్పే..!
ఏపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ సీటు కూడా ఒకటి. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉన్న కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లింల హవా ఉంటుంది. దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ సీటులో ముస్లింల తర్వాత ఎస్సీ, వైశ్య కులాల ప్రభావం ఎక్కువ. ఇప్పటివరకూ 1952 నుంచి 2019 వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా ఆరుసార్లు ముస్లిం అభ్యర్ధులే గెలిచారు.
కర్నూలు లోక్ సభ సీటు పరిధిలో ఉన్న కర్నూలు అసెంబ్లీ సీటు ప్రధానంగా అర్బన్ నియోజకవర్గం. కర్నూలు నగరానికే ఈ నియోజకవర్గం పరిమితమై ఉంటుంది. రాష్ట్రంలో గంటూరు తూర్పు సీటు తర్వాత ముస్లిం అభ్యర్ధులు ఎక్కువసార్లు గెలిచిన సీటు కూడా ఇదే. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ముస్లింలు, వైశ్యులు రెండుసార్లు, ఓసారి ఇండిపెండెంట్ బ్రాహ్మణ అభ్యర్ధి, ఓసారి ఎస్సీ, మరోసారి రెడ్డి ఇలా అన్ని కులాల వారికి ఇక్కడ అవకాశాలు దక్కాయి.

టీడీపీ ఆవిర్భావానికి ముందు కర్నూలు అసెంబ్లీ సీటుకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏకంగా ఐదుసార్లు (1952, 1955, 1967, 1972, 1978) గెలిచింది. ఇందులో మూడుసార్లు ముస్లింలే గెలిచారు. ఓసారి దామోదరం సంజీవయ్య, మరోసారి ఇండిపెండెంట్ గెలిచారు. టీడీపీ పుట్టాక ఇక్కడ 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ మూడుసార్లు (1985, 1989, 2009), కాంగ్రెస్ కూటమి అభ్యర్ధి ఓసారి(2004), టీడీపీ కూటమి అభ్యర్ధిగా గఫూర్ ఓసారి గెలిచారు. టీడీపీ రెండుసార్లు (1983, 1999), వైసీపీ రెండుసార్లు (2014, 2019) గెలిచాయి.
గత మూడు ఎన్నికలు గమనిస్తే.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి టీజీ వెంకటేష్.. సీపీఎం అభ్యర్ధి గఫూర్ పై 44 వేల భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్ధి ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్ పై 3479 ఓట్లతో గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ .. టీడీపీ అభ్యర్ధి టీజీ భరత్ పై 5353 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి కూడా వైసీపీ, టీడీపీ పోరు తప్పేలా లేదు. అలాగే ఎవరు గెలిచినా నాలుగైదు వేల మెజార్టీ మించి రాకపోవచ్చని అంచనా.












Click it and Unblock the Notifications