హోదాపై కేంద్రం అబద్ధాలు చెప్తోంది: కేవీపీ ఫైర్, సోనియా లేఖ రాసినా..
న్యూఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు ఎక్కడా వెల్లడించలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. అవాస్తవాన్ని నిజమని నమ్మించవచ్చని బీజేపీ విశ్వసిస్తోందని, అందుకోసమే వాళ్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో సహా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేవీపీ.. గురువారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టారు.
కాగా, కేవీపీ ప్రవేశపెట్టిన తీర్మానం శుక్రవారం మధ్యాహ్నం 2.30గంటలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేవీపీ మాట్లాడుతూ.. హోదాపై ఆర్థిక సంఘం ఎలాంటి ప్రతికూల సిఫార్సులూ చేయకపోయినా ఎవరికీ కనిపించనివి బీజేపీకి మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు.
విభజన హామీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ లేఖ రాశారని కేవీపీ రామచంద్రరావు అన్నారు. సోనియా పీఎంకు లేక రాసిన నాటికి 14వ కమిషన్ రూపుదిద్దుకోలేదని చెప్పారు. ఆ తర్వాత 19-2-2015న మరో లేఖ మోడీకి సోనియా రాశారని, అప్పటికి కూడా 14వ ఫైనాన్స్ కమిషన్ గురించి ఎవరికీ తెలియదని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడా లేదని కేవీపీ తెలిపారు. తమ లక్షాలను సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని కేవీపీ స్పష్టం చేశారు.