హైకమాండ్తో తేల్చుకుంటాం: లగడపాటి, ఫ్లెక్సీల పైనా..
గుంటూరు/హైదరాబాద్: తమకు ఏఐసిసి సమావేశానికి పాసులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని, తాము అధిష్టానంతోనే తేల్చుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ గురువారం గుంటూరు జిల్లాలో అన్నారు. తమ హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. కాంగ్రెసువాదిగా ప్లీనరీకి హాజరయ్యే హక్కు తమకుందన్నారు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతోనే తేల్చుకుంటామన్నారు.
తాము అవిశ్వాసం నోటీసు ఇచ్చింది కాంగ్రెసు పార్టీ పైన కాదని, యూపిఏ పైన అన్నారు. సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారో తమకు తెలియదన్నారు.

చాలా మాట్లాడాలి: జెసి
ఏఐసిసి సమావేశానికి సీమాంధ్ర ప్రాంత నేతలకు ఆహ్వానం అందలేదని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో ఇంకా చాలా మాట్లాడాల్సి ఉందని మాజీ మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డిలు అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నేతలను సమావేశానికి ఆహ్వానించి అధిష్టానం తమ పైన వివక్ష చూపుతోందన్నారు. పిలువని పేరంటానికి తాము వెళ్లమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు అవసరం లేదని పెద్దలు భావిస్తున్నారన్నారు. సీమాంధ్రలో ఫ్లెక్సీల ఎవరు పెట్టారో తమకు తెలియదన్నారు.
బిల్లు పైన చర్చకు గడువు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ ద్వారా కోరుతామన్నారు. అసెంబ్లీలో చర్చ సమయాన్ని కాంగ్రెసు పార్టీ వృథా చేయలేదని చెప్పారు. బిల్లుపై చర్చించడానికి మరింత సమయం కోరడాన్ని కుట్రపూరితమని తెలంగాణవాదులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారన్నారు.
గజల్ శ్రీనివాస్పై కేసు నమోదుకు ఆదేశం
ఎపిఎన్జీవోల సభలో జాతీయ గీతాన్ని అవమానపర్చే రీతిలో ఆలపించిన గజల్ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్ నెలలో జరిగిన ఎపిఎన్జీవో సభలో గజల్ శ్రీనివాస్ జాతీయ గీతాన్ని అవమానించినట్లుగా పిటిషన్ వేశారు.
సిఎం రేసులో లేను: సర్వే
కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వేరుగా అన్నారు. కేంద్రంలో రాహుల్ సారథ్యంలో వచ్చే ప్రభుత్వంలో మంత్రి కావడం పైనే తన దృష్టి అన్నారు. తాను సిఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ బిల్లుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, బిల్లుపై నిర్ణయాధికారం పార్లమెంటుకే ఉందన్నారు. అసెంబ్లీ ప్రమేయం నామమాత్రమే అన్నారు.
ఇచ్చిన సమయంలో చర్చించకుండా మరింత సమయం కోరడం సరైంది కాదన్నారు. మరింత సమయం ఇవ్వవద్దని రాష్ట్రపతిని కోరుతామన్నారు. ఎమ్మెల్యేలు వద్దన్నా విభజన ఆగదన్నారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోదని చెప్పారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిరాధారమన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే బిల్లుపై చర్చకు మరింత గడువు ఇవ్వవద్దని తాము రాష్ట్రపతిని కోరుతామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. చర్చపై గడువు పెంచుతారని సీమాంధ్ర నేతలే మీడియాకు లీకులిచ్చారన్నారు.












Click it and Unblock the Notifications