మెడికో సంధ్య ఆత్మహత్య: ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేస్తామన్న మంత్రి
గుంటూరు: వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమై పరారీలో ఉన్న గుంటూరు ప్రభుత్వాస్పత్రి గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిని త్వరలో అరెస్టు చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టంచేశారు. ఆమెను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్ట చేశారు.
లక్ష్మి వేధింపులతోనే పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎంఈ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చిందని, దీని ఆధారంగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు సెల్ఫోనలో సిమ్లు కూడా తొలగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు కష్టంగా మారిందని మంత్రి చెప్పారు.

ఆమెను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరస్తామన్నారు. ప్రస్తుత ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, లక్ష్మి భర్త డాక్టర్ విజయసారధిని ఆ పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు. ప్రొఫెసర్లు, ఇతర వైద్య బోధన సిబ్బంది వేధింపులకు పాల్పడినా, ఇబ్బందులు పెట్టినా వారిపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రకటించారు.
లక్ష్మికి పాస్పోర్టు లేదు: సౌత్ కోస్టల్ జోన్ ఐజీ
సంధ్యారాణి ఆత్మహత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్లు సౌత్ కోస్టల్ జోన్ ఐజీ ఎన్.సంజయ్ తెలిపారు. లక్ష్మిని వెతికేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామన్నారు.
ఆమె విదేశాలకు వెళ్లకుండా ఎయిర్ పోర్టులకు కూడా సమాచారం పంపించామని సంజయ్ తెలిపారు. ఆమెకు పాస్పోర్టు లేదని తమ విచారణలో తేలిందన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications