చినబాబు ఐనా చట్టం తనపని: బాబుపై నాయిని, టీడీపీ కొత్త వాదన, సవాల్
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం చెప్పారు. పెదబాబు, చినబాబు అని చట్టం చూడదన్నారు. ఆయన రేవంత్ రెడ్డి వ్యవహారంలో పైవిధంగా మాట్లాడారు.
తెలంగాణ సంబరాల పైన మాట్లాడుతూ.. రేపు లక్షమందితో హైదరాబాదులో ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు. సిగ్నల్స్ లేని ట్రాఫిక్ విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏడాది తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా మేం విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.

రేవంత్ ఇష్యూపై తెలుగుదేశం పార్టీ ఇలా...
రేవంత్ రెడ్డి వ్యవహారంపై తెరాస నేతలకు ధీటుగా టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. అందుకు వాళ్లు పలు కారణాలు చూపిస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్ చెల్లదని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తాజాగా మరో అంశాన్ని కూడా తెర పైకి తీసుకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొన్నేళ్ల క్రితం కర్నాటక నాటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేయడానికి దారి తీసిందని గుర్తు చేస్తున్నారు.
ఏపీ పోలీసు అధికారులు కూడా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకొని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా వారు కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
బాబుపై దమ్ముందా: తెలంగాణ టీడీపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ తన అనుచరులతో మాట్లాడించడం కాదని దమ్ముంటే రేవంత్ కేసులో చంద్రబాబు పాత్రను బయటపెట్టాలని తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావులు సవాల్ విసిరారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ వారి ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకోవడం ప్రలోభం కిందకు రాదా అని ప్రశ్నించారు. ప్రజా కోర్టుకు తాము సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రజా కోర్టుకు కోదండరాం, గద్దర్, విమలక్కలే జడ్జిలుగా ఉంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications