కాంగ్రెసులోకి జగన్ పార్టీ నేత: టిడిపిలోకి.. (పిక్చర్స్)
హైదరాబాద్: లోకసభ, శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నాయకుల వలసలు జోరందుకున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకులు దూకడం వేగం పుంజుకుంది. సీమాంధ్రలో కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుండగా, తెలంగాణలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు. బిజెపిలోకి కూడా వలసలు సాగుతున్నాయి.
బుధవారం నెల్లూరు ప్రజాగర్జన సభలో చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ 8వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖారరైంది. ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి పార్టీ తరపున బరిలో నిలవనున్నారు. గల్లా అరుణ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశముందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే శిల్పామోహన్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న శిల్పామోహన్రెడ్డి బుధవారం నంద్యాలలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 8న చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, కాంగ్రెసు నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతులు బిజెపిలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒంగోలు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. ఆయన నెల్లూరు లోకసభ సీటు ఆశిస్తున్నారని సమాచారం. దీంతో ఇంతకు ముందు నెల్లూరు ఎంపీ టికెట్టును బుధవారం పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డికి ఇవ్వాలని భావించినా, తాజాగా ఆయనను మళ్లీ ఎమ్మెల్యేగానే బరిలో నిలపవచ్చని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా బుధవారం ఉదయం చంద్రబాబును కలిశారు.
మహబూబ్నగర్కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండ జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వర రావు బిజెపిలో చేరారు. ఆయనతో పాటు తెలంగాణ జెఎసి జిల్లా చైర్మన్ అమరేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్రా రాఘవరెడ్డి మనవరాలు నర్రా జయలక్ష్మి, రిటైర్డ్ ఎస్పీ సాయన్న, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాయల్ శంకర్ తదితరులు బుధవారం బిజెపిలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. నాలుగైదు రోజుల్లో కోటవురట్లలో బహిరంగ సభ ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.

కాంగ్రెసులోకి జగన్ పార్టీ నేత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, మాజీ శాసనసభ్యురాలు స్వర్ణ సుధాకర్ బుధవారంనాడు కాంగ్రెసు పార్టీలో చేరారు.

బిజెపిలోకి సంకినేని..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వర రావు బిజెపిలో చేరారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చారు.

టిడిపిలోకి ఆదాల
కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారంనాడు చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

బిజెపిలోకి పురంధేశ్వరి..
మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజెపిలో చేరడానికి సిద్ధపడ్డారు. ఆమెతో పాటు ఆమె భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా బిజెపిలో చేరబోతున్నారు

టిడిపిలోకి గల్లా అరుణ కుమారి..
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన కాంగ్రెసు నాయకురాలు గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.

జయదేవ్ కూడా..
గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన గుంటూరు పార్లమెంటు సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications