అధికారం పోవటంతో టీడీపీకి షాక్ ఇస్తున్న సొంతపార్టీ నేతలు .. ఇదంతా జగన్ ఎఫెక్టేనా ?
ఏపీలో టీడీపీ చావు దెబ్బ తింది. ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది . ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుకు షాక్ ఇవ్వటానికి సిద్ధం అవుతున్నారు సొంతపార్టీ నేతలు . గత కొంత కాలంగా టీడీపీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారానికి దూరమైనా టీడీపీ నుండి ఒక్కొక్క నేత దూరమౌతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు తమ దారి తాము చూసుకొంటున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కీలకనేతలకు వైసీపీతో పాటు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు. అసలే అధికారం పోగొట్టుకున్న టీడీపీ సొంత పార్టీ నేతలను కాపాడుకుంటుందా? అసహనంతో ఉన్న పార్టీ నేతలు టీడీపీని వీడనున్నారా ?ఇదంతా జగన్ ఎఫెక్టేనా ? ఇవి ప్రస్తుతం అందరూ చర్చిస్తున్న అంశాలు .
టీడీపీని వీడనున్న నేతలు.. ప్రత్యర్ధి వర్గాల ఎత్తుగడలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలవం 23 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడం టీడీపీని దెబ్బ తీసింది. అధికారం దూరమైంది. జగన్ సీఎంగా పాలన చేపాట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఇతర పార్టీలకు చెందిన నేతలను టీడీపీలో చేర్చుకుంది టీడీపీ . అంతే కాదు కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలపై కొందరు నేతలు టీడీపీపై అసహనంతోఉన్నారు. అందుకే పార్టీ వీడుతున్నారు. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు కూడ టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడినవారు, గత పదేళ్లుగా పార్టీలో పని చేస్తున్నా గుర్తింపు లేని నాయకులు, తాజాగా ఎన్నికలకు ముందు పార్టీ మారిన నేతలు టీడీపీని వీడేందుకు సిద్ధపడుతున్నారు.
టీడీపీకి పలు కీలక నేతల రాజీనామా .. టీడీపీ కి ఝలక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు
కర్నూల్ జిల్లాలో టీడీపీ కీలక నేతలుగా ఉన్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు కీలకం. తమకు తెలియకుండానే ఆలూరులో కోట్ల సుజాతమ్మకు టిక్కెట్టు కేటాయించడాన్ని బొజ్జమ్మ దంపతులు సహించలేదు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కని నేతలు కూడ పార్టీని వీడేందుకు సిద్దమౌతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత డాక్టర్ వెంకట్రావు కూడ టీడీపీని వీడనున్నారు. ఆయన కృష్ణా జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు. కానీ, రెండు దఫాలుగా ఆయనకు చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వలేదు. ఇలా అసహనంతో ఉన్న వారు పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు.
రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలని నిర్ణయం .. చంద్రబాబు ఏం చేస్తారో ?
ఇలా పార్టీలోని ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులే కాక , ప్రధాన పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ వీడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటు జగన్ ఎఫెక్ట్ తో పాటు బీజేపీ కూడా టీడీపీ నేతలను బీజేపీలో చేర్చే వ్యూహం లో ఉంది. అందుకోసం రాం మాధవ్ ను రంగంలోకి దింపింది అని సమాచారం . ఇప్పుడు పార్టీని కాపాడుకునే బాధ్యత చంద్రబాబుపై ఉంది. మరి చంద్రబాబు తాజా పరిణామాల నేపధ్యంలో మరో ఐదేళ్ళ పాటు పార్టీని కాపాడుకోవటం కత్తి మీద సామే.