ఏపీ కొత్త జిల్లాలు-చంద్రబాబు బాటలోనే జగన్-అమరావతిలో విమర్శించి ఇప్పుడు...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు శరవేగంగా సాగిపోతోంది. 26 జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుతో పాటు కొత్ అధికారులు బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోతోంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అతిపెద్ద అధికారిక కార్యక్రమంలో అధికార వైసీపీ నేతల హంగామా కనిపిస్తోంది. కానీ విపక్షాలకు మాత్రం కనీస ఆహ్వానం కూడా అందలేదు. దీంతో వారంతా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోతున్నారు. గతంలోనూ అమరావతి రాజధానిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని మండిపడ్డ జగన్.. ఇప్పుడేం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
ఏపీలో ఇవాళ్టి నుంచి 13 జిల్లాల స్ధానంలో 26 కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి. గతంలో ఉన్న 13 జిల్లాల్లో విభజన, జిల్లా కేంద్రాల మార్పు, డివిజన్ల మార్పు.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇదంతా అధికారికంగానే జరుగుతోంది. అయితే అధికారికమైనా విపక్షాలను మాత్రం భాగస్వాముల్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో ఈ జిల్లాల ఏర్పాటు కాస్తా వైసీపీ పార్టీ కార్యక్రమంగా సాగిపోతోంది. దీంతో విపక్షాలు దీనిపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
విపక్షాలకు అందని ఆహ్వానం
జిల్లాల ఏర్పాటు వంటి రాష్ట్రస్ధాయి కార్యక్రమంలో విపక్షాలను కూడా భాగస్వాముల్ని చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం వారికి కనీస ఆహ్వానం కూడా పంపలేదు. జిల్లాల ఏర్పాటును అంగరంగవైభవంగా నిర్వహిస్తూ పత్రికల్లో సైతం జాకెట్ యాడ్స్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విపక్షాలను మాత్రం ఆహ్వానించలేకపోయింది. దీంతో జిల్లాల ఏర్పాటు వైసీపీ సొంత కార్యక్రమంగా సాగిపోతోంది. జిల్లాల ఏర్పాటు కోసం ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల మధ్య ముహుర్తం పెట్టుకున్న వైసీపీ సర్కార్.. ఈ సమయంలో జిల్లాల్లో అధికారికంగా జిల్లాల్ని అమల్లోకి తీసుకురానుంది. దీనికి వైసీపీ నేతలు జిల్లాల్లో హంగామా చేస్తున్నారు.
వర్చువల్ తో సరిపెడుతున్న జగన్
రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుండగా.. సీఎం క్యాంపు జగన్ దీన్ని తన క్యాంపు కార్యాలయం నుంచే అధికారికంగా ప్రారంభించబోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్రంలో అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించే అవకాశం ఉన్నా జగన్ మాత్రం వర్చువల్ ప్రారంభానికే మొగ్గు చూపారు. ఓవైపు విపక్షాలను ఆహ్వానించకుండా మరోవైపు తాను కూడా బహిరంగంగా ఈ కార్యక్రమం చేపట్టకుండా కేవలం వర్చువల్ గా ప్రారంభిస్తుండటం విపక్షాలకే కాదు సొంత పార్టీ నేతలకు సైతం మింగుడు పడటం లేదు.
అమరావతిలో చంద్రబాబు చేసినట్లే ?
గతంలో అమరావతి రాజధాని శంఖుస్ధాపన, పనుల ప్రారంభం, ఇతరత్రా కార్యక్రమాల విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ను నిర్లక్ష్యం చేసేది. ఏ కార్యక్రమానికీ సరైన ఆహ్వానం అందించేది కాదు. ఆహ్వానం పంపినా ప్రభుత్వంలో అప్రాధాన్య మంత్రులతో ఇచ్చి పంపేది. వారు నిత్యం జగన్ పై విమర్శలు చేసే వారే. దీంతో సదరు ఆహ్వానాలకు విలువ కూడా ఉండేది కాదు. జగన్ కూడా వచ్చేవారు కాదు. దీంతో రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో జగన్ ఎప్పుడూ దర్శనమివ్వలేదు. ఆ తర్వాత దాని ప్రభావం అమరావతిని ద్వేషిస్తూ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేసే వరకూ వెళ్లింది. ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకంగా జగన్ పావులు కదుపుతూనే ఉన్నారు.