ఒక్కటౌదాం: పవన్కు జేపీ వెల్కం, జగన్కు భయమని మంత్రులు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తామని లోక్సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ ఆదివారం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పైన ఈ నెల 15న హైదరాబాదులో ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజీ.. తదితరాల పైన పవన్ కళ్యాణ్తో పాటు జయప్రకాశ్ నారాయణ కూడా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా దీనిపై బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల కోసం, ఆర్థిక పరిస్థితి కోసమంటూ జేపీ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ జరుపుతామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల కోసం పోరాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పవన్, జేపీలు ఒక్కటిగా...
తెలుగు రాష్ట్రాలకు.. ముఖ్యంగా ఏపీకి జరుగుతున్న నష్టం పైన పవన్ కళ్యాణ్, జేపీలు కలిసి కేంద్రానికి విన్నవించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జేపీ మల్కాజిగిరి నుండి లోకసభకు పోటీ చేశారు. జేపీకి బీజేపీ, జనసేనలు సానుకూలంగానే ఉన్నాయి.
అయితే, కూటమి ధర్మంలో భాగంగా మల్కాజిగిరిలో బీజేపీ, జనసేనలు టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతు పలికాయి. మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలోనే పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. జేపీ మంచి వ్యక్తి అని, అయితే, కూటమి ధర్మంలో భాగంగా తాను ఆయనకు మద్దతివ్వలేనని చెప్పారు. అప్పుడు జేపీ పైన మల్లారెడ్డి విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు ఆ నేతలు తెలుగు రాష్ట్రాల కోసం ఒక్కతాటిపైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ ఇటీవలే రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతుల భూములు లాక్కోవద్దని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. రాజధానిలో పవన్ పర్యటన పైన భిన్న వాదనలు వినిపించినప్పటికీ... ఇప్పుడు పవన్ ప్రత్యేక ప్యాకేజీ పైన కూడా దృష్టి సారించాల్సి ఉంది.
తాను మద్దతిచ్చిన బీజేపీని నిలదీయాల్సి ఉందని అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో బీజేపీ పైన, రాజధాని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం పైన.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జయప్రకాశ్ నారాయణ అప్పుడే సమర్థించారు. ఇప్పుడు కలిసి తెలుగు రాష్ట్రాల కోసం పోరాడుతామని అన్ని పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు సిద్ధమైన జేపీ.. పవన్ను కూడా ఆహ్వానిస్తానని చెప్పారు.
మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలను తీసుకు రావడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన టీడీపీ నేతలు ధీటుగానే స్పందిస్తున్నారు. వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షులు దమ్ముంటే బీజేపీని నిలదీయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
మంత్రులు అచ్చన్నాయుడు, పత్తిపాటి పుల్లారావులు శనివారం మాట్లాడుతూ.. ఏదైనా మాట్లాడితే ఈడీ కేసులు, అరెస్టులు తప్పవన్న భయం జగన్కు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఇన్ని రోజులకు.. అది అసెంబ్లీ ఉంది కాబట్టి చాటుగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనలా కేసుల మాఫీ కోసం రాజీపడాల్సిన అవసరం తమకు లేదన్నారు.
కేంద్రంపై నమ్మకం ఉందన్న గంటా
విభజన హామీలను కేంద్రం అమలు చేస్తుందని ఆశిస్తున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఏపీ కోసం పార్లమెంట్లో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు పోరాడన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు జరపలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో మాట్లాడుతారన్నారు.