జగన్ గాల్లోంచి నేలకు దిగు ... జనం వరద కష్టాలు కనిపిస్తాయి: విరుచుకుపడ్డ లోకేష్
వరదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాయలసీమ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలంగా మారింది. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతాల ప్రజలు సహాయం కోసం అర్ధిస్తున్నారు. వాగులు, వంకలు, నదులు ఉగ్ర రూపం దాల్చాయి. వరదలకు అనేకమంది ప్రాణాలు జలసమాధి అయ్యాయి.
వరద సహాయక చర్యలపై జగన్ ను టార్గెట్ చేసిన నారా లోకేష్
ఇదిలా ఉంటే భారీ వర్షాల దెబ్బకు ఏపీలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రాజెక్టులు ప్రమాదకరంగా మారాయని, ముంపులో జనం చచ్చిపోతుంటే జగన్ సర్కార్ కు అవేవీ పట్టడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వరదలపై, సర్కారు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు కనీసం పట్టించుకోకుండా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని భారీ వర్షాలు వరదల కారణంగా తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది అని ఇప్పటికే జగన్ సర్కార్ పై ధ్వజమెత్తిన నారా లోకేష్ ముంపు ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలపై పెదవి విరిచారు. ప్రాణనష్టం సంభవించకుండా కాపాడడంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని ధ్వజమెత్తారు.
సీఎం సొంత జిల్లాలో వరదల్లో జనం చనిపోతే కూడా పట్టింపు లేని జగన్
ఇక తాజాగా ఈ రోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన నేపథ్యంలో మరోమారు ధ్వజమెత్తిన లోకేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని నేలకు దిగితే జనం వరద కష్టాలు కనిపిస్తాయని నారా లోకేష్ పేర్కొన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో 30 మంది గల్లంతు అయితే, అందులో 12 మంది చనిపోతే ఏం జరిగిందో కనుక్కునే తీరికలేని ముఖ్యమంత్రిని ఏమనాలి అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. గల్లంతైన వారి కోసం వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హుదూద్ , తిత్లీ తుపానులు వస్తే ప్రభుత్వం బాధితులకు అండగా ఉందని గుర్తు చేశారు.
.ysjagan గాల్లోంచి నేలకు దిగు..జనం వరద కష్టాలు కనిపిస్తాయి. సీఎం సొంత కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోతే..ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని ముఖ్యమంత్రిని ఏమనాలి?వరదకష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం వస్తుందని ఎదురుచూడటం వృథా.,(1/2)#AndhraPradeshFloods pic.twitter.com/kwyN2n7nsy
— Lokesh Nara (naralokesh) November 20, 2021
కుప్పంలో దొంగ ఓట్లపై పెట్టిన శ్రద్ధ వరదలపై పెడితే సహాయం అందేది
వరద కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం వస్తుంది అని ఎదురుచూడటం వృధా అంటూ పేర్కొన్న లోకేష్ ముంపు బాధితులకు సహాయం అందించడానికి అధికారులు వస్తారనేది భ్రమ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలలో దొంగఓట్లపై పెట్టిన శ్రద్ధ వరద ముంపు ప్రాంతాలపై పెట్టినట్లయితే బాధితులకు కనీసం సహాయమైనా అందేది అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారం మనకు లేకపోయినా సహాయం చేసే మనసు, స్పందించే మానవత్వం ఉందని పేర్కొన్న ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర అనుబంధ విభాగాలు వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు చెయ్యండి అంటూ లోకేష్ పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ ట్రస్టు తరఫున అందిస్తున్న సేవలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.