జగన్ పాలనలో రోజుకో రైతు రోడ్డెక్కే పరిస్థితి, రాష్ట్రంలో రైతుల క్రాప్ హాలిడే : లోకేష్, అయ్యన్న ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ హయాంలోఅరాచక పాలన కొనసాగుతుందని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, రైతులు ఆత్మహత్యలు చేస్తున్నా పట్టించుకున్న వారు లేరని టీడీపీ నేతలు నిత్యం జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ నాయకులు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు మరోమారు సర్కార్ పై విరుచుకుపడ్డారు.

జగన్ పాలనలో రోజుకో రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి : లోకేష్
సీఎం జగన్ పాలనలో న్యాయం చేయండి అంటూ రోజుకో రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెం లో రైతు వేమారెడ్డిని నష్ట పరిహారం చెల్లించకుండా వేధిస్తున్నారని, రైతు నుంచి భూమిని లాక్కుని స్వయంగా మంత్రి అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాలువకు గండి కొట్టి పొలాల మీదుగా నీటిని తరలించడం దారుణమని లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాదు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంక్షోభంలో ఏపీ వ్యవసాయ రంగం.. ఆదుకోవటంలో వైసీపీ సర్కార్ ఫెయిల్ : అయ్యన్న
రైతాంగ సమస్యలపై, వైసిపి సర్కారు తీరుపై తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రైతులను కాపాడడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విఫలమయ్యారని మండిపడ్డారు.

వ్యవసాయం చేయలేక రైతులు క్రాప్ హాలిడే
ఇప్పటికే వ్యవసాయం చేయలేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే పది లక్షల ఎకరాల పంట దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చూపిస్తున్న ఖర్చుకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అసలు సంబంధమే లేదన్నారు. రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయిందన్నారు.

మోటార్లకు మీటర్లు పెడుతున్నారు
రైతుల కంట కన్నీరే మిగిలిందని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు కోస్తా జిల్లాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని అందుకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఇవి చాలవన్నట్టు మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రైతులకు నాడు టీడీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఇప్పుడు అందటం లేదని విమర్శించారు.

వైసీపీ రైతుల సంక్షేమం విస్మరించిందని టీడీపీ పోరాటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టిడిపి ఇప్పటికే రైతు కోసం తెలుగుదేశం పేరుతో రైతు సమస్యలపై పోరాటం సాగించిన విషయం తెలిసిందే. టిడిపి ఆందోళనలలో భాగంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రైతుల సంక్షేమం విస్మరించిందని టీడీపీ ఆరోపిస్తోంది. సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని, కాలువల పూడికతీత పనులు చేపట్టింది లేదని నిప్పులు చెరుగుతోంది.ఇక వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ కుమీటర్లు పెట్టి రైతు ఆత్మహత్యలని పెంచే ప్రయత్నం చేస్తున్నారే తప్పా మరి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడుతోంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని పదేపదే వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది టీడీపీ.












Click it and Unblock the Notifications