మీలో చలనం రావాలంటే ఇంకెంతమంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి: లోకేష్ సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస అత్యాచారాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. రాష్ట్రంలో మహిళా రక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కార్, మహిళల మానప్రాణాలను కాపాడడంలో ఘోరంగా విఫలం అవుతుంది అంటూ మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి, ఇంట్లోకి వెళ్లి మహిళను బలవంతంగా అత్యాచారం చేసిన ఘటనపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించిన లోకేష్ మీలో చలనం రావాలంటే ఇంకా ఎంతమంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి ఘోరం జరిగినా మీ మనస్సు కరగదా? అని నిలదీశారు. పైగా మహిళా హోంమంత్రి తానేటి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని మాట్లాడటం అన్యాయం అంటూ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడటం దారుణం అని పేర్కొన్న లోకేష్ రాష్ట్రంలో అత్యాచారాలకు జే బ్రాండ్ లిక్కర్ కారణమని పేర్కొన్నారు .

జే బ్రాండ్ లిక్కర్ తాగి ఉచ్ఛనీచాలు మరిచి అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గాయపడిన మహిళకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని లోకేష్ పేర్కొన్నారు. ప్రతిరోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలతో రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందని నారా లోకేష్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. దిశ చట్టం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని లోకేష్ మండిపడుతున్నారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలపై, రాష్ట్రంలో కొనసాగుతున్న నేరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీడీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలం అవుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications