యూనివర్సిటీలు వైసీపీ కార్యాలయాలుగా.. ఆధిపత్యమంతా రెడ్లదే: ఆ వీడియో పోస్ట్ చేసి లోకేష్ ఫైర్!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రం అన్ని విధాలుగా సర్వనాశనం అవుతుంది అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి వైసిపి స్వప్రయోజనాల కోసమే పని చేస్తుందని నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతుందని, యూనివర్సిటీలలో చదువు అటకెక్కుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చిన జగన్: లోకేష్ ఫైర్
తాజాగా మరోమారు జగన్ సర్కారు తీరు పై విరుచుకుపడ్డ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బిసి ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతుంది అంటూ పేర్కొన్న లోకేష్ సదరు ఉద్యోగి తీవ్ర ఆవేదనతో చేసిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .
పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పిన జగన్
జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం విఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం అత్యంత బాధాకరమని లోకేష్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి కి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
సీఎం కులపిచ్చ తగ్గించుకుంటే మంచిది అన్న జగన్
రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో చూసినా మొత్తం రెడ్డి రాజ్యమే కొనసాగుతుందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. మీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని పేర్కొన్న లోకేష్, సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గ పోకడలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
రెడ్డి రాజ్యంలో ఉద్యోగం చేయలేక విసిగిపోయానని ఉద్యోగి ఆవేదన
ఇదిలా ఉంటే కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ గా ఉన్న నాగభూషణం మాట్లాడిన వీడియోలో రెడ్డి రాజ్యంలో ఉద్యోగం చేయలేక విసిగివేసారి పోతున్నాం అంటూ పేర్కొన్నారు. గతంలో జేఎన్టీయూలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరికి ప్రమోషన్లు ఇచ్చారని, కానీ తనకు ప్రమోషన్ ఇవ్వకుండా 250 కిలోమీటర్ల దూరం బదిలీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తను డ్యూటీలో చేరానని, తన తల్లిదండ్రులు పేషెంట్లనీ, తన భార్యకు మరో చోటికి బదిలీ అయిందని, కనీసం వారిని చూసుకోడానికి కూడా లేక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నానని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. అధికారులకు చెబితే పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని, అందుకే ఈ ఉద్యోగం చేసే బదులు వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.
Recommended Video
యూనివర్సిటీలలో పెత్తనం అంతా రెడ్డి సమాజికవర్గానిదే అంటూ ఆరోపణ
తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండటం కోసం తాను పోరాటం చేస్తానని పేర్కొన్న నాగభూషణం, యూనివర్సిటీలు మొత్తం సీఎం జగన్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. పేరుకు మాత్రమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పదవుల్లో ఉన్నారని, పెత్తనమంతా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే లోకేష్ రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.