రూటు మార్చిన లోకేష్: మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు; ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రూటు మార్చినట్లుగా కనిపిస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా నారా లోకేష్ పర్యటన చేయడం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పడమే కాదు, నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడానికి లోకేష్ కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నట్లు గా రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.
అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే ఆ గ్రామాల్లో జగన్ ధనదాహం; లోకేష్ సంచలనం
మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటనలు
మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యాడు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలు కావడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు వైసిపి నేతలు లోకేష్ మంగళగిరి ఎన్నికల ఓటమిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ఓడిపోయాడని, అసమర్ధుడని ఎద్దేవా చేస్తున్నారు. ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయడానికి వేరే నియోజకవర్గం చూసుకుంటాడు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే ఆ చర్చకు చెక్ పెడుతూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు.
మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలలో పర్యటిస్తున్న లోకేష్
ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తన పర్యటనలతో ఉత్సాహం నింపుతున్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే లోకేష్ పావులు కదుపుతున్నారని తాజా పరిణామాలతో అర్థమౌతుంది. గత నెల రోజులలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలలో పర్యటిస్తున్న లోకేష్ ప్రజలతో నేరుగా కలిసి మాట్లాడుతున్నారు. వారితో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారన్న లోకేష్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటం చేస్తానని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వంపై దాడి
మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని చెబుతున్నారు. ఎవరు కట్టవలసిన అవసరం లేదని తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని లోకేష్ చెప్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఇక గురువారంనాడు లోకేష్ తాడేపల్లి మండలం లోని ఉండవల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు గ్రామాల్లో ఉన్న టిడిపి కార్యకర్తలు యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్న లోకేష్ ఇటీవల పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త శ్రీనివాస్ ను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని వెల్లడించారు.