వారి కన్ను పడితే కబ్జా; ఆశపడితే ఆక్రమణ : వీడియో పోస్ట్ చేసి మరీ .. జగన్, వైసీపీ నేతలపై లోకేష్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలు సాగిస్తున్నారు, ఏపీలో అరాచక పాలన కొనసాగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం కొనసాగుతోందని, అధికారం అండగా ఉందని అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వంత పాడుతున్నారని మండిపడుతుంది. ఇక ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు మాత్రమే కాకుండా, సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా వైసీపీ నేతల దురాగతాలకు బలవుతున్నారని టిడిపి విమర్శిస్తోంది.
జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల అరాచకం .. ఓ ముస్లిం వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో పోస్ట్
ఈ క్రమంలో తాజాగా దువ్వూరు మండలంలో మైనారిటీ కుటుంబం తమకు వైసీపీ నేతల నుండి, స్థానిక సిఐ నుండి ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపింది. జగన్ సర్కార్ హయాంలో దళితులకే కాదు ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శలు వెల్లువగా మారాయి. దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషాకు జగన్ అంటే వీరాభిమానం. గతంలో పాదయాత్ర చేసిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిశారు. అయితే భాషాకు అతని భార్య పుట్టింటివారు ఎకరాల 50 సెంట్ల భూమిని ఇచ్చారని, దానిని కబ్జా చేయడానికి స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని భాషా ఒక సేల్ఫీ వీడియోలో తన ఆవేదన తెలియజేశారు.
స్థానిక ఎమ్మెల్యే, సిఐ పై ఆరోపణలు .. తనకు ప్రాణహాని ఉందని ఆవేదన
స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సిఐ కొండారెడ్డి కూడా తన భూమిని కబ్జా చెయ్యాలని చూస్తున్న వారికి మద్దతు ఇస్తున్నారని భాషా ఓ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. స్థానిక సిఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. తమకు న్యాయం చేయకపోతే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని భాషా కుటుంబం వెల్లడించింది. నంద్యాలలో అబ్దుల్ కలాం కుటుంబ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే, తాజాగా అక్బర్ బాషా కుటుంబం పై వేధింపులు కొనసాగడంతో తెలుగుదేశం పార్టీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సాగుతున్న అరాచకాలపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.
జగన్ రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారింది
ఈ క్రమంలో సీఎం జగన్ రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా అక్బర్ బాషా సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసిన ఆయన వారు కనబడితే కబ్జా .. ఆశపడితే ఆక్రమణ అంటూ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే నిర్బంధం అంటూ నిప్పులు చెరిగారు. కబ్జాలపై పోరాడితే పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ నాయకులు ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
Recommended Video
ముస్లింలంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత కక్ష ? లోకేష్ ప్రశ్న
వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేశారని, సీఎం సొంత జిల్లా, సీఎం సొంత పార్టీ కార్యకర్త భాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రోదిస్తున్నారంటే.. రాష్ట్రంలో ఏ స్థాయి దౌర్జన్యాలు సాగుతున్నాయో అర్థం అవుతోందని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి మరీ అంతం చేశారని గుర్తుచేసి, ఇప్పుడు మరో ముస్లిం మైనారిటీ కుటుంబం ఉసురు పోసుకోవద్దు అంటూ హితవు పలికారు. అంతేకాదు ముస్లింలంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత కక్ష అంటూ లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.