సబ్జెక్ట్ లేని సీఎం జగన్ మూడు రాజధానులంటూ కాలక్షేపం; విశాఖను దోచుకోవటం ఆపాలన్న లోకేష్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులని తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, రాజధాని విషయంలో జగన్ తీరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పిన జగన్ విశాఖ నగరాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

హెచ్ఎస్బిసి మూతపడటం బాధాకరం : నారా లోకేష్
విశాఖ నగరాన్ని దోచుకోవడం ఆపి అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిన లోకేష్ సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బిసి మూతపడటం బాధాకరం అంటూ ఆయన పేర్కొన్నారు.

నియంత నిర్ణయాలు, బెదిరింపులతో ఇతర రాష్ట్రాలకు కంపెనీలు
విశాఖకు ఐటీ నగరంగా గుర్తింపు తీసుకువచ్చిన సంస్థ, ఉత్తరాంధ్ర యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించిన సంస్థ, అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో పేరొందిన హెచ్ఎస్బిసి 15 సంవత్సరాల క్రితం విశాఖలో క్యాప్టివ్ బిపిఓ సెంటర్ ను ప్రారంభించి ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ బ్యాంకులకు ఇక్కడినుండే సేవలు అందించినదని ఇప్పుడు అది కాస్తా మూతపడటం బాధాకరమని నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు
ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్ఎస్బిసి కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనం అంటూ లోకేష్ మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు అని పేర్కొన్న లోకేష్ విశాఖను దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని, విశాఖలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్ అక్కడ రాజధాని ఏర్పాటు చేయకపోగా, రాజధాని పేరుతో అక్కడ వైసీపీ నేతలు భూ దందాలకు పాల్పడుతున్నారని గతంలోనే టిడిపి నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రానికి, విశాఖకు అపార నష్టం అన్న లోకేష్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడిందని, రాజధాని వ్యవహారంలో అనిశ్చితి నెలకొందని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పించారు. రాజధాని ఏమిటో తెలియక ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని, చాలా సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అని, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కుంటుపడిందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి హయాంలో విశాఖ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఐటి హబ్ గా గుర్తింపు పొందిందని.. కానీ ప్రస్తుతం సీఎం జగన్ నిర్ణయాల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపుల కారణంగా అనేక కంపెనీలు తరలి పోతున్నాయని, ఏపీ వైపు చూడటం మానేశాయి అని లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications