విద్యార్థుల పట్ల పిడుగురాళ్ళ పోలీసుల అరాచకం.. జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలు అధికార పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలు చింపారంటూ మైనర్ విద్యార్థుల పట్ల పిడుగురాళ్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన టిడిపి నేతలకు ఆయుధంగా మారింది.
పిడుగురాళ్ళ మండలం జానపాడు లో విద్యార్థులు ఆడుకుంటుండగా ఫ్లెక్సీలు పొరపాటున చిరిగాయి. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరగటంతో దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు పిల్లలు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఒక పూట పిల్లలను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. దీంతో ఈ విషయం తెలిసిన స్థానిక టిడిపి నేతలు విద్యార్థులను వ్యక్తిగత పూచీకత్తు మీద విడిపించి తీసుకువెళ్లారు. ఇక ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా వైయస్ జగన్ గారు ? వైసిపి నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని లోకేష్ మండిపడ్డారు . ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్ లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారు అంటూ పేర్కొన్నారు. ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వేధించడం వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకి అద్దం పడుతోందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అరాచక పాలనగా మారిందని మండిపడ్డారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా @ysjagan గారు? వైసిపి నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు..,(1/3) pic.twitter.com/FZd8Uiv0fU
— Lokesh Nara (@naralokesh) April 26, 2022
బాలల హక్కులను కాలరాసే విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వేధించడానికి కారణమైన వైసీపీ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలకు ఇప్పుడు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.