జూన్ నుంచి ప్రజాక్షేత్రంలో లోకేష్: మహానాడు తర్వాత రంగంలోకి; టీడీపీ వ్యూహం ఇదేనా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటినుండే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుండే పర్యటనల బాట పడుతున్నారు ప్రధాన పార్టీల నాయకులు. ఇప్పటికే చంద్రబాబు మహానాడుకు ముందే పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలతో రంగంలోకి లోకేష్
వైసీపీ ప్రభుత్వ హయాంలో బాదుడే బాదుడు అంటూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు . ఇక ఇదే సమయంలో ఈ నెల నుండి నారా లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడవలసి వస్తుంది. ఇక నారా లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
రానున్న ఎన్నికలే టార్గెట్ గా రంగంలోకి లోకేష్
పార్టీలో చంద్రబాబు తర్వాత ఆయనకు ప్రత్యామ్నాయం నారా లోకేష్ అని చూపించే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నప్పటికీ అందులో టిడిపి అధినేత చంద్రబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అందుకు కారణం మొదటి నుండి నారా లోకేష్ సమర్ధత మీద ఉన్న దురభిప్రాయం. అయితే ఈసారి రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక భూమిక పోషించాలని ప్రయత్నిస్తున్న లోకేష్, ప్రజాక్షేత్రంలో తన ముద్ర వేయడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంతో పాటు జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు
గతంలో పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న లోకేష్ తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో టిడిపి మహానాడు నిర్వహించనుంది. దాదాపు లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు. మహానాడు తర్వాత రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్న లోకేష్ ప్రజాక్షేత్రంలో ఉండటంకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జూన్ నెలలో లోకేష్ పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
ప్రాజెక్ట్ ల సందర్శన.. వైసీపీ పాలనా వైఫల్యాలు ప్రజలకు చూపించే యత్నం
లోకేష్ తన పర్యటనలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసింది ఏంటి? వైసిపి ప్రభుత్వ కాలంలో ఏం చేశారు? అన్న అంశాలను నేరుగా ప్రజలకే చూపిస్తానని లోకేష్ చెప్తున్నారు. గతంలో సీమలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అందుకే చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారని పేర్కొన్న లోకేష్, 13 వేల కోట్ల రూపాయలతో తాను మంత్రిగా ఉన్న సమయంలో జల ధారను తీసుకువచ్చానని అయితే ప్రస్తుతం దాన్ని ఆపేశారని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టాలని ప్రయత్నాలు సాగిస్తానని చెబుతున్న లోకేష్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.