ఆర్టీసీ ఛార్జీల బాదుడే బాదుడన్న లోకేష్; నీ శోకాలు ఏంటి పప్పూ?:సాయిరెడ్డి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ జగన్ ప్రభుత్వం మరోమారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సీఎం జగన్ బాదుడే బాదుడు అంటూ ఆర్టీసీ ఛార్జీల పెంపు పై జగన్ సర్కారు తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఇక లోకేష్ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ వేశారు.

నిన్న ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదు: లోకేష్
తాజాగా యధా సీఎం తధా అధికారులు.. ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారు అంటూ మండిపడ్డారు లోకేష్. నిన్న ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణం. కిలోమీటర్ల బట్టి ఛార్జీలు పెంచడం వలన ప్రజల పై పెను భారం పడిందని లోకేష్ పేర్కొన్నారు.
వైసిపిపాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి: లోకేష్
ఇతర సర్వీసుల్లో కి.మీ.ల చొప్పున కనిష్టంగా రూ.30 నుండి గరిష్టంగా రూ.120 భారం పడనుందని లోకేష్ వెల్లడించారు. పాస్ లు, ఏసీ బస్సులో బాదుడుకి అడ్డుఅదుపు లేదని పేర్కొన్నారు. వైసిపిపాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి దాపురించిందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

జగన్ సర్కార్ బాదుడుపై లోకేష్ మండిపాటు
నిన్నటికి నిన్న ఏపీలో పెరిగినఆర్టీసీ ఛార్జీలపై అసహనం వ్యక్తం చేసిన లోకేష్వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారుఅంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లోకేష్ డిమాండ్
సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని వెల్లడించిన లోకేష్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన లోకేష్ కుడి చేతితో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలని లోకేష్ హితవు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆందోళనలు
ఇదిలాఉంటే ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు కొనసాగిస్తున్నారు టిడిపి నేతలు పన్నులు, చార్జీలతో ప్రజలను జగన్ ప్రభుత్వం బాదేస్తోందని, బాదుడే బాదుడు అంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

ధరలు భారీగా పెరిగాయని డీజిల్ సెస్ వేస్తే నీ శోకాలు ఏంటి పప్పూ? సాయిరెడ్డి వ్యంగ్యం
ఇక పెంచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయంలో టీడీపీ ఆందోళనలు, లోకేష్ విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రివర్స్ ఎటాక్ చేశారు. ట్రావెల్స్ మాఫియా కోసం ఆర్టీసీ గొంతు కోయాలని చూశాడు నీ తండ్రి అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ధరలు భారీగా పెరిగాయని డీజిల్ సెస్ వేస్తే నీ శోకాలు ఏంటి పప్పూ? అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. ఆర్టీసీకి రోజుకు 3.5 కోట్ల నష్టంవస్తోంది. ప్రభుత్వంలో కలిపి ఆర్టీసిని బతికించారు జగన్ గారు. ఎలా నడపాలో ఆయనకు తెలుసు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి కావాలని ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications