ప్రేమ కథలో ట్వీస్ట్: సాయిని కొట్టి చంపేశారు, బోరుమంటున్న తల్లి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో జరిగిన ఘటన మలుపులు తిరుగుతోంది. మహ్మదీయపాలెం గ్రామంలో అమ్మాయిపై అత్యాచారం చేసి, ఇద్దరు యువకులు ఆమెను చంపేశారనే ప్రచారం ఎదురు తిరుగుతోంది. అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను గ్రామస్థులు బట్టలిప్పేసి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టినట్లు అర్థమవుతోంది.
ఆ చిత్రహింసలకు శ్రీసాయి అనే యువకుడు మరణించగా, గాయపడిన పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేపల్లే ప్రభుత్వాస్పత్రి జాస్మిన్, శ్రీసాయి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జాస్మిన్, శ్రీసాయి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. శ్రీసాయి తల్లి పోలీసులతో వివాదానికి దిగింది. జాస్మిన్, శ్రీసాయి మధ్య ప్రేమ వ్వవహారమే ఈ సంఘటనకు దారి తీసినట్లు భావిస్తున్నారు. జాస్మిన్కు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. దాంతో ఇంట్లో ఎవరి లేని సమయంలో జాస్మిన్ శ్రీసాయికి ఫోన్ చేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ మీడియాకు చెప్పిన విషయాలను బట్టి వారిద్దరు ప్రేమించుకుంటున్నారని, జాస్మిన్ ఫోన్ చేయడంతో శ్రీసాయి తనను తీసుకుని మహమ్మదీయపాలెం వెళ్దామని చెప్పడంతో తాము బైక్పై అక్కడికి వెళ్లామని అతను చెప్పాడు. పవన్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంట్లో ఎవరూ సమయంలో జాస్మిన్ సాయిని పిలించింది. దాంతో సాయి పవన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఇరువురు బైకుపై మహ్మదీయపాలెం గ్రామం వెళ్లారు. వాళ్లు వెళ్లే సరికి జాస్మిన్ వద్ద మరో అమ్మాయి ఉంది. వాళ్లను చూసి అమ్మాయి వెళ్లిపోయింది. సాయి ఇంట్లోకి వెళ్లాడు. పవన్ బైకు పార్కు చేసి బయటే ఉన్నాడు.
ఇంతలో గౌస్ అనే వ్యక్తి వాళ్లను చూసి జాస్మిన్ అన్నయ్యకు ఫోన్ చేశాడు. గౌస్ తలుపు తట్టడంతో శ్రీసాయిని జాస్మిన్ బయటకు పంపించి వేసింది. గౌస్ ఫోన్ చేసి జాస్మిన్ అన్నయ్యకు విషయం చెప్పాడు. ఇద్దరు యువకులు ఇంటికి దూరంగా వెళ్లాడు. ఆ తర్వాత జాస్మిన్ సాయికి ఫోన్ చేసి విషయం తన అన్నయ్యకు తెలిసిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.
దాంతో పవన్, సాయి అంతకు ముందు ఇంట్లో ఉన్న అమ్మాయికి విషయం చెప్పి జాస్మిన్ ఇంటికి పంపించారు. ఆ తర్వాత వారిద్దరు ఓ వృద్ధుడికి, ఓ మహిళకు విషయం చెప్పి వారిని తీసుకుని జాస్మిన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే జాస్మిన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో 108కి ఫోన్ చేశారు. ఈలోగా గ్రామస్థులు వచ్చి వాళ్ల బైకు తాళం చెవులు లాక్కుని గ్రామస్థులు రెచ్చిపోయి యువకులపై విరుచుకుపడ్డారు.
తాము జాస్మిన్ను కాపాడాలనే చూశామని పవన్ అంటున్నాడు. తమను ఊళ్లో ప్రతి ఒక్కరూ కొట్టారని, పోలీసులు కూడా వారిని అడ్డుకోలేదని చెబుతున్నాడు. తమను చెట్టుకు కట్టేసి రాడ్లు, కర్రలతో కొట్టారని, కారం పోసి కొట్టారని అతను చెబుతున్నారు.
ఆస్పత్రి వద్ద పవన్ తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నాడు. తాము ఎవరి జోలికీ వెళ్లినవాళ్లం కాదని, తన కుమారుడిని నిష్కారణంగా కొట్టారని, పోలీసుల వల్ల తన కుమారుడు బతికి బయటపడ్డాడని అంటున్నారు. కాగా, శ్రీసాయి తల్లి ఆస్పత్రి వద్ద బోరుమంటోంది. తన పిల్లాడిది ఏ మాత్రం తప్పు లేదని చెబుతోంది. తన కుమారుడి చావుకు కారణమైన నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.