ఏపీకి చల్లని కబురు- ఎల్లుండి బంగాళాఖాతంలోఅల్పపీడనం- రేపటి నుంచి వర్షాలు
ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు త్వరలో రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఈ నెల 11న ప్రారంభమయ్యే వర్షాలు కనీసం మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముంది. ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. వరుసగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ విభాగం ఎప్పటికప్పుడు జిల్లాల్లో అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. వర్షాలతో పాటు పిడుగుల అంచనాల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులకు అందిస్తోంది.