తూర్పుగోదావరి స్కూల్లో కుల విభజన వివాదం-వారు అక్కడ-వీరు ఇక్కడ-సర్పంచ్, అధికారుల తీరుతో
తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బ్రహ్మపురి ప్రాధమిక పాఠశాలలో విద్యార్ధులను అధికారులు కులం పేరుతో మరో స్కూలుకు మార్చడం వివాదాస్పదంగా మారింది. అధికారులు, సర్పంచ్ తీరుపై మండిపడుతున్న స్ధానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు.
2015కు ముందు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలో ఉన్న బ్రహ్మపురి గ్రామంలో రెండు స్కూళ్లు ఉండేవి. 2015లో ఇందులో ఒక దానిని మోడల్ స్కూలుగా మార్చి మూలపొలంలో ఉన్న రెండోదాన్ని అందులో కలిపేశారు. దీంతో ఇందులో కొత్త భవనాలు నిర్మించి అభివృద్ధి చేశారు. తాజాగా ప్రభుత్వం తిరిగి మూలపొలంలో ఉన్న రెండో పాఠశాలలను తెరవాలని నిర్ణయం తీసుకుంది. అక్కడే వివాదం మొదలైంది. స్కూలు తెరిచిన తర్వాత విద్యార్ధుల సర్దుబాటు వివాదానికి కారణమైంది. బ్రహ్మపురి స్కూల్లో మొత్తం 52 మంది విద్యార్ధులు చదువుతుండగా.. వీరిని రెండు సగాలుగా విభజించి 26 మందిని మూలపొలం స్కూలుకు మార్చారు. అక్కడికి మార్చిన విద్యార్ధులంతా ఒకే సామాజికవర్గం కావడంతో వివాదం నెలకొంది.
పునరుద్ధరించిన మూలపొలం పాఠశాలలోకి బ్రహ్మపురి స్కూల్లో చదువుతున్న మత్సకారుల పిల్లల్ని మార్చేశారు. మిగతా కులాల పిల్లల్ని మాత్రం బ్రహ్మపురి స్కూల్లో కొనసాగిస్తున్నారు. దీంతో వివాదం మొదలైంది. అన్ని వసతులున్న బ్రహ్మపురి పాఠశాలలో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లల్ని కొనసాగిస్తూ తమ పిల్లల్ని మాత్రం మూలపొలం స్కూలుకు మార్చడంపై మత్సకారులు మండిపడుతున్నారు. దీనికి స్ధానిక సర్పంచ్ తో పాటు విద్యాశాఖ అధికారులే దీనికి కారణమని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో విచారణ జరిపారు అయితే విచారణ తర్వాత రెండు స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్దులు ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ చదువుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు.