మటన్ లో బీఫ్ కలిపి అమ్ముతున్న మాఫియా .. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జీహెచ్ఎంసీ అధికారులు
అసలే కరోనా కాలం. అందులోనూ జంతు మాంసం విషయంలో జనాలు భయపడుతున్న తరుణం. ఇక ఇదే సమయంలో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . గొర్రె, మేక మాంసంలో బీఫ్తో పాటు ఇతర జంతువుల మాంసం కలిపి విక్రయిస్తున్న మాఫియాను హైదరాబాద్లో అధికారులు పట్టుకున్నారు. భాగ్యనగర్ వేదికగా దందా జరుగుతున్నట్లు గుర్తించిన వెటర్నరీ శాఖ అధికారులు ఈ కల్తీ దందాకు చెక్ పెట్టాలని రంగంలోకి దిగారు .
ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్
జోరుగా మటన్ కల్తీ ..హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న దందా
హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మటన్ అమ్ముతున్న దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి . మాంసం అమ్మకాలు, అక్రమాలు, అధిక ధరలపై పరిశీలన కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.బాబు బేరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వెటర్నరీ అధికారుల కమిటీ మూడు రోజులుగా జీహెచ్ఎంసీలో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఇక ఈ తనిఖీలలో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్టు గుర్తించారు. బార్కాస్, మణికొండ, అసిఫ్ నగర్, జియాగూడ, గోల్కొండ,అంబర్పేట్, నాంపల్లి, రెడ్హిల్స్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు మటన్ దుకాణాల్లో గొడ్డు మాంసం మటన్ లో కలిపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగిన అధికారులకు కళ్ళుబైర్లు గమ్మే నిజాలు
మటన్ ధర విపరీతంగా ఉన్న నేపధ్యంలో అక్రమ సంపాదనకు తెరతీసిన వ్యాపారులు కొందరు ఎలాంటి లైసెన్స్ లేకుండానే మటన్ విక్రయాలు చేస్తున్నారు.హైదరాబాద్ కేంద్రంగా తనిఖీలు చేసిన అధికారులు మొత్తం 62 దుకాణాలు తనిఖీ చేస్తే 50 దుకాణాలకు లైసెన్స్ లేదు. ఇక కొన్ని చోట్ల చికెన్ వ్యాపారులే మటన్ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు . కరోనా సమయంలో పౌష్టికాహారం తినాలని చెప్తున్న నేపధ్యంలో నిన్నా మొన్నటి దాకా మాంసాహారం అంటే ఆమడ దూరం పారిపోయిన వాళ్ళు ఒక్కసారిగా మాంసాహారం కోసం ఎగబడుతున్నారు .
మటన్, చికెన్ ధరలు ఎక్కువగా ఉండటంతోనే విపరీతంగా కల్తీ
ఇక ఈ క్రమంలోనే చికెన్ 200, మటన్ 800 నుండి కొన్ని చోట్ల 1100 వరకు అమ్ముతున్నారు. ఇక అదీ కల్తీ మటన్. గొడ్డు మాంసంతో కలిపి అమ్ముతున్న పరిస్థితి. ఎలాంటి హానికరమైన మాంసాన్ని మనం తింటున్నామో చెప్పకనే చెప్తుంది . ప్రజల నుండి మటన్ కోసం పెరుగుతున్న డిమాండ్ , మరోపక్క రంజాన్ మాసం , ధరలు అధికంగా ఉన్న పరిస్థితుల నేపధ్యంలో బీఫ్ కలిపి ప్రజలను మోసం చేస్తున్నారు . దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది . మాసం దుకాణాలు, ప్రభుత్వ స్లాటర్ హౌజ్లు, అక్రమ స్లాటర్ హౌజ్లు, మాంసం రవాణా, గొర్రెలు, మేకలు కోస్తున్న తీరు అన్నీ పరిశీలించి ఒక నివేదిక ఇవ్వనుంది .
నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వారిపై కొరడా
చాలా చోట్ల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు . ఇక మటన్లో బీఫ్ కలుపుతున్నట్లు తాజా తనిఖీల్లో తేలటంతో ఆ వ్యాపారులను గుర్తించి టాస్క్ఫోర్స్కు అప్పగిస్తున్నారు . ఇక అన్ని అంశాలపై 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు అధికారులు. ఇక గొర్రెల రవాణా నుండి మాంసం కోసి విక్రయించే వరకు జరుగుతున్న అవకతవకలను అన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం మాత్రమే కాక ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని పలు సిఫారసులను చెయ్యనున్నారు . ఏది ఏమైనా అధికారుల తనిఖీల్లో సామాన్యులు విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి రావటంతో ఇప్పుడు మళ్ళీ మరోమారు మటన్ తినాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .
Recommended Video