ఏలూరు ఎంపీ సీటుపై మాగంటి బాబు వర్సెస్ యనమల.. ! అభ్యర్ధి మారతారా ?
ఏపీలో కీలకమైన ఏలూరు ఎంపీ సీటులో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ను నిలబెట్టాలన్న పార్టీ నిర్ణయం బూమరాంగ్ అవుతోంది. వైసీపీ అభ్యర్ధిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ ను నిలబెట్టిన నేపధ్యంలో టీడీపీ వ్యూహాత్మకంగా యనమల అల్లుడిని రంగంలోకి దింపింది. అయితే గతంలో కమ్మ సామాజిక వర్గ నేతలే ఎక్కువగా పోటీ పడిన ఈ స్ధానంలో బీసీ అభ్యర్ధి పేరుతో పుట్టా మహేష్ యాదవ్ ను రాయలసీమ నుంచి తీసుకురావడంపై మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్రంగా మండిపడుతున్నారు.
పుట్టా మహేష్ యాదవ్ కు ఏలూరు ఎంపీ సీటు కేటాయించడంపై ఇప్పటికే మండిపడుతున్న మాగంటి బాబు.. ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన కీలక విమర్శలు చేశారు. ముఖ పరిచయం లేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని చరిత్ర కలిగిన ఏలూరు ఎంపీ సీటులో ఎలా నిలబెడతారంటూ ఆయన ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు, బీసీలు ఎవరైనా ఏలూరు ఎంపీ సీటు అడిగారా, ఇది మాకు పొగబెట్టడం కాదా అంటూ మాగంటి బాబు టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

బీసీ వర్గానికే టికెట్లు ఇవ్వాలనుకుంటే నాలుగు సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తారా అంటూ మాగంటి బాబు సూటిగా ప్రశ్నించారు. 4 సీట్లు ఒకే కులానికి ఇస్తే మిగతా కులాలు ఒప్పుకుంటాయా అని కూడా అడిగారు. అసలు మాకు మాత్రమైనా చెప్పరా అని నిలదీశారు. అసలు పార్టీకి పుట్టా మహేష్ చేసిన సేవలేంటి ?, నేను చేసిన సేవలేంటో తెలియదా అంటూ ప్రశ్నించారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు జిల్లాలో ఉన్న కారణంగా స్ధానికుడికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. అయితే ఆయన రాజ్యసభ ఇస్తానన్నారని, కానీ తాము ఒప్పుకోలేదని, దీంతో చంద్రబాబు త్వరలో దీనిపై మాట్లాడదామని చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications