కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు అరెస్టు
విజయవాడ: కల్తీ మద్యం కేసులో పోలీసులు కాంగ్రెసు పార్టీ నాయకుడు మల్లాది విష్ణును అరెస్టు చేశారు. ఈ కేసులో గత రెండు రోజులుగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు చివరకు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఆయనను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గురువారం రాత్రి 11.20 గంటలకు అరెస్టు చేశారు. విష్ణును సిట్ పోలీసులు పన్నెండున్నర గంటల పాటు విచారించారు. స్వర్ణ బార్ లైసెన్స్దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుంరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కెఎ లక్ష్మిని కూడా పిలిపించిన సిట్ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలినవారిని ఎదరెదురుగా కూర్చోబెట్టి విచారించారు. .
సిట్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారిని పలు వివరాలు అడిగినట్లు సమాచారం. తొలి రోజు బుధవారం విచారణలో చెప్పిన విషయాలనే విష్ణు గురువారంనాడు కూడా చెప్పినట్లు సమాచారం. లైసెన్స్దారులు చెబుతున్న విషయాలతో పోల్చి చూస్తే విష్ణు చెప్పిన విషయాలు కొంత తేడాగా ఉన్నట్లు తెలిసంది. దీంతో విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

కల్తీ మద్యం కేసులో ఏర్పాటైన ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) తనను మూడు గంటల పాటు విచారించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు అరెస్టుకు ముందు గురువారం తెలిపారు. రెండో రోజు గురువారంనాడు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వర్ణ బార్లో విష ప్రయోగం జరిగిందని అనుమానిస్తున్నామని అధికారులు తనతో విచారణలో చెప్పారన్నారు. అయితే అందుకు గల కారకులెవరో తేల్చాలని సిట్కు చెప్పానని అన్నారు. కారకులు ఎవరో తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సిట్ చెప్పిందన్నారు.












Click it and Unblock the Notifications