మహిళలు ఫోన్ లిఫ్ట్ చేస్తే.. అసభ్య సందేశాలు, అరెస్టు
హైదరాబాద్: సెల్ఫోనులో అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ ఫోన్లు చేస్తూ మహిళలను వేధిస్తున్న ఓ వ్యక్తిని సిసిఎస్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ పాలరాజు వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ నాని స్థానికంగా ట్రాక్టర్ విడిభాగాల వ్యాపారం చేస్తున్నాడు.
ఇతను ఏదో ఒక సెల్ఫోన్కు రింగ్ చేస్తాడు. మహిళలు మాట్లాడితే ఆ నెంబరును సేవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అసభ్యకరమైన సందేశాలు పంపించడం, ఫోనులు చేస్తూ అభ్యంతకరమైన మాటలతో వేధించడం చేస్తుంటాడు. ఆరుగురు మహిళలను వేధించాడు. ఓ మహిళా వైద్యురాలు కూడా అందులో ఉంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిని తాడేపల్లి గూడెంలో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకు వచ్చారు.
అదనపు కట్నం కోరి కటకటాలలోకి
అదనపు కట్నం కోసం పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులను వేధించిన పెళ్లి కొడుకును ఫలక్నుమా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన కలీముద్దీన్ గత పదేళ్లుగా సౌదీలో అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. బహదూర్ పుర జహానుమా ప్రాంతానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. రూ.5 లక్షల నగదు, వంద గజాల స్థలం, ఐదు తులాల బంగారం కట్నంగా ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
దీంతో శనివారం ఫలక్నుమాలోని ఓ ఫంక్షన్ హాలులో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. అయితే రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన కలీముద్దీన్ శుక్రవారం యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి స్విఫ్ట్ కారుతో మరింత అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే పెళ్లి జరగదని చెప్పాడు. దీంతో యువతి సోదరుడు అజీజ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.