గుంతలో పడి వ్యక్తి మృతి-మరొకరికి కష్టం రాకూడదని పూడ్చిన కుటుంబం-ప్రశంసల వెల్లువ
రోడ్లపై ప్రమాదం జరిగితే దాన్ని చూస్తూ పట్టించుకునే తీరిక లేని ప్రపంచం ఓవైపు. అదే తమ కుటుంబ సభ్యలకు జరిగితే మాత్రం అందరూ రావాలని కోరుకునే స్వార్ధం మరోవైపు. ఇలాంటి పరిస్ధితుల్లో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోవడానికి కారణమైన రోడ్డుపై గుంతను పూడ్చడం ద్వారా అదే కష్టం మరొకరికి రాకూడదని ఆ కుటుంబం భావించింది. దీంతో ఆ గుంత మాయమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైజాగ్ లో వ్యక్తిని మింగేసిన రోడ్డు గుంత
విశాఖపట్నంలో ఈ నెల 4న రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ కు బైక్ పై వెళ్తున్నారు. మధ్యలో రోడ్డుపై గుంతను చూసుకోలేదు. దీంతో ఆ గుంతలో పడ్డారు. బైక్ నడుస్తున్న వేగమో, గుంత లోతో తెలియదు కానీ రోడ్డుపై పడిపోయారు. అంతే ఆ రోడ్డు గుంత ఆయన్ను మింగేసింది. రవ్వా సుబ్బారావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబానికి కుటుంబ పెద్ద దూరమయ్యారు. రోడ్డుపై గుంతలో పడి తమ కుటుంబ సభ్యుడు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
మరొకరికి ఆ కష్టం రావొద్దని...
తమ కుటుంబ సభ్యుడు రవ్వా సుబ్బారావును మింగేసిన ఆ గుంతను అలాగే తిట్టుకుంటూ వదిలేయలేదు ఆ కుటుంబం. ఆ గుంత వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు మరొకరికి ఆ కష్టం రాకూడదని భావించారు. వెంటనే దాన్ని పూడ్చే పని చేపట్టారు. తమ సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, కంకర తీసుకెళ్లి దాన్ని విజయవంతంగా పూడ్చేశారు. తద్వారా మరో ప్రమాదం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో ఈ ఘటన వైజాగ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అధికారులు చేయాల్సిన పనిని బాధితులు చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
Recommended Video
ప్రముఖుల ప్రశంసల వెల్లువ
రోడ్డుపై గుంతలో పడి తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని ఏడుస్తూ కూర్చుకుండా.. మరొకరికి ఆ కష్టం రాకూడదన్న సామాజిక స్పృహతో ఆ గుంతను పూడ్చేసిన రవ్వా సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. ఇవాళ న్యూస్ పేపర్లలో దీనిపై వార్తలు రావడంతో వాటి క్లిప్లింగ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత పీవీపీ వంటి వారు ఈ ఘటనపై స్పందించారు. రవ్వా సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.