భార్యతో వైవాహికేతర సంబంధం: వ్యక్తిని హత్య చేసిన భర్త

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే రవి అనే వ్యక్తి సిద్దును దారుణంగా హత్య చేశాడు. తలను మొండెం నుంచి వేరు చేసి దుప్పట్లో చుట్టి మొదటి అంతస్థు నుంచి కిందికి పడేశాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు చెందిన టేకు రవి భార్య సువర్ణతో కలిసి కూకట్పల్లిలోని ఎల్లమ్మబండలో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఆటో డ్రైవర్ సిద్ధు సువర్ణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించిన రవి బోరబండలోని తులసీనగర్కు మకాం మార్చాడు. అక్కడికి కూడా సిద్ధూ తరచూ వచ్చి వెళుతున్నట్టు గుర్తించాడు. ఎలాగైనా అతడ్ని అంతం చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తులసీనగర్ వచ్చిన సిద్ధుతో రవి దంపతులు గొడవపడ్డారని తెలిసింది. ఆ తర్వాత సిద్ధు హత్యకు గురయ్యాడు. రవి ఇంటి ముందు దుప్పట్లో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మూట విప్పి చూడగా సిద్ధు తల, మొండెం భాగాలు వేర్వేరుగా ఉన్నాయి. రవి, సువర్ణ దంపతులు కనిపించకపోవడంతో వారే హత్య చేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications