ప్రతీకారం: మామ్మ చివరి కోరిక తీర్చడానికే హత్య
న్యూఢిల్లీ: మామ్మ చివరి కోరిక తీర్చడానికి ఓ యువకుడు హత్య చేశాడు. అతను కృష్ణా జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డాడు. అవనిగడ్డ డిఎస్పీ కె. హరి రాజేంద్రబాబు ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన లింగినేని సాంబశివ రావు 1998లో గ్రామంలోని మద్యం దుకాణం వద్ద తెల్లతిన వివాదం కారణంగా హత్యకు గురయ్యాడు.
ఆ హత్య కేసులో సూర్యచంద్రరావు అనే వ్యక్తి అయిదో నిందితుడు. ఈ కేసును రెండేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. హతుడు సాంబశివ రావు తల్లి వెంకటనరసమ్మ గుంటూరు లింగమనేనిపాలెంలో ఉంటూ తరుచుగా కుమారుడి ఫొటోకు పూజలు చేస్తుండేది.
ఆమె మనవడు, సాంబశివర రావు మేనల్లుడి కుమారుడైన రాజా కూడా అదే గ్రామంలో ఉండేవాడు. సాంబశివ రావు హత్య ఘటన గురించి వెంకటనరసమ్మ రాజాకు పదే పదే వివరిస్తుండేది. తన కుమారుడిని చంపినవారిని ముక్కలు ముక్కలుగా నరకాలని చెబుతుండేది. ఈమె మాటలకు రాజా ప్రభావితుడయ్యాడు. వెంకటనరసమ్మ 2011లో అనారోగ్యంతో మరణించింది.
ఆ తర్వాత రాజా శ్రీకాకుళానికి చంెదిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడే కాపురం పెట్టాడు. సూర్యచంద్రరావును చంపేందుకు అదును కోసం ఎదురు చూడసాగాడు. సూర్యచంద్రరావు ఈనెల 22వ తేదీన శ్రీకాకుళంలోని వంగతోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన రాజా అక్కడికి వెళ్లి దారుణంగా హత్య చేశాడు.
సూర్యచంద్రరావును హత్య చేసిన తర్వాత రాజా పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గురువారంనాడు అతను నిమ్మగడ్డ లాకుల వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేసి అవనిగడ్డ కోర్టులో హాజరు పరిచారు. మామ్మ చివరి కోరిక తీర్చేందుకే తాను హత్య చేసినట్లు నిందితుడు చెప్పాడు.