ప్రేయసి చేసిన పని నచ్చక చంపేసి, ఆత్మహత్య చేసుకున్నాడు
కడప: మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
నిమ్మనపల్లె మండలం వెంకటాపురానికి చెందిన గాయత్రి భర్త చనిపోవడంతో మదనపల్లె టమోటా మార్కెట్లో కూలి పనిచేస్తూ బతుకుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. మార్కెట్లోనే పనిచేస్తున్న మరో కూలీ కురబలకోట మండలం తెట్టుకు చెందిన శ్రీనివాసులుతో పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
అతడికి వచ్చిన కూలి డబ్బులు కూడా ఆమె తీసుకునేది. దాంతో ఆగకుండా మరో వ్యక్తితో ఆమె సంబంధం ఏర్పరచుకుంది. ఇది తెలిసి ఇలా చేయడం మంచిది కాదని, మానుకోవాలని ప్రియుడు శ్రీనివాసులు గాయత్రిని హెచ్చరించాడు. అయితే వినలేదు.
దాంతో శ్రీనివాసులు బుధవారం రాత్రి ప్రియురాలిని తెట్టుకు రావాలని కోరాడు. దీంతో స్వగ్రామం నిమ్మనపల్లె నుంచి బయలుదేరి తెట్టుకు వచ్చింది. శ్రీనివాసులు ఆమె ను కడప రోడ్డులోని కేఎన్ఎం కోల్డ్స్టోరేజ్ వెనుక వైపుకు తీసుకెళ్లి దారుణంగా హత్యచేశాడు.
ఆ తర్వాత తెట్టుకు వెళ్లి తాను కూడా ఆత్యహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రూరల్ సీఐ మురళి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.