అఫైర్: తల్లీకూతుళ్లను చంపి, తాను ఉరేసుకున్నాడు
విజయవాడ/ విశాఖపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడురులో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవార తెల్లవారుజామున వెంకన్న అనే వ్యక్తి తల్లీకూతుళ్లను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుల్లో ఓ మహిళ ఎనిమిది నెలల గర్భిణిగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ అఘాయిత్యానికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధురాలి హత్య, నగల దోపిడీ
విశాఖపట్నం నగరంలో దుండగులు బీభత్సం సృష్టించారు. పెద్దగండ్యాల మండలం నెల్లిముక్కులో మహాలక్ష్మి అనే వృద్ధురాలిని బంగారం కోసం దుండగులు హత్య చేశారు. తన కుమారులతో నివాసముంటున్న మహాలక్ష్మిని ఇంటికి అద్దెకు వచ్చిన ఓ జంట కొబ్బరి కొట్టడానికి రావాలంటూ పై అంతస్థులోకి తీసుకెళ్లారు.
తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన నిందితులు ఆమె ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.