శిలువతో శ్రీవారి ఆలయ ప్రదక్షిణ, గణేష్ చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉల్లంఘన జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి శిలువ గుర్తు కలిగిన పూసల దండను చేతబట్టి ఆలయ ప్రదక్షిణలు చేశాడు. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో డ్రైవరుగా అతను పని చేస్తున్న షణ్ముగంగా గుర్తించారు.
మంగళవారం అతను ఓ భక్త బృందం కారులో తిరుమల వచ్చాడు. ఈ క్రమంలో సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ శిలువ గుర్తు దండను చేతబట్టి మాడవీధుల్లో ప్రదక్షిణలు చేశాడు. గుర్తించిన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుంది. అతనిని విచారించింది.
తాను హిందువునే అని, స్నేహితుడు ఇచ్చిన లాకెట్తో తిరిగి వచ్చానని షణ్ముగం చెప్పాడు. శ్రీవారి ఆలయంలోని నిబంధనలు తనకు తెలియవని, క్షమించాలని కోరాడు. అతను హిందువేనని తేలడంతో పోలీసులు విచారించి వదిలేశారు.
సింహాచలంలో అపచారం
విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయానికి వెళ్లే దారిలో ఆలయానికి అత్యంత సమీపంగా వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కొందరు యువకులు... ఓ మహిళా డ్యాన్సర్తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. దీనిపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసుల పైన కొరఢా ఝులిపించారు. విచారణకు ఆదేశించారు.