ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు అందలేదు; తిరుమలలో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
మా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వారి రాజీనామాలు అందాక స్పందిస్తాం : మంచు విష్ణు
నిన్నటికి నిన్న తమ ప్యానల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వివిధ కారణాల కారణాల వల్ల ప్రత్యర్థి ప్యానెల్ లోని సభ్యులు రాజీనామా చేశారని అది చాలా దురదృష్టకరమని మాట్లాడిన విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేశారని మీడియా ద్వారానే తెలిసిందని, ఇప్పటి వరకూ తన వద్దకు రాజీనామా లేఖలు రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ వద్దకు రాజీనామా లేఖలు వస్తే ఆ తర్వాత ఏం చేయాలి అన్నది ఆలోచిస్తామని, ఆ విషయం గురించి అప్పుడు మాట్లాడతామని మంచు విష్ణు పేర్కొన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదన్న మోహన్ బాబు
తిరుమలలో ఎవరి గురించి కాంట్రవర్సీలు మాట్లాడనని పేర్కొన్న మంచు విష్ణు తమ ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితే అధ్యక్షుడైనట్టు తెలిపారు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం అద్భుతమైన పనులు చేయడానికి తిరుమల స్వామివారిని బలం ప్రసాదించమని కోరుకున్నామని చెప్పారు. మోహన్ బాబు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదని, చాలా బాధ్యతతో కూడుకున్న పని అని, చాలా గౌరవప్రథమైన అని పేర్కొన్నారు. 'మా' సభ్యులందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నానని అన్నారు.
విష్ణు 'మా' ను తీర్చిదిద్దుతారన్న మోహన్ బాబు
సభ్యులందరూ బలపరచడం వల్లే తన కొడుకు విష్ణు 'మా' అధ్యక్షుడు కాగలిగాడని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను అత్యద్భుతంగా మంచు విష్ణు తీర్చిదిద్దుతారని మోహన్ బాబు తెలిపారు. ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారిలో మోహన్ బాబు కుటుంబంతో పాటు మా సభ్యులు శివ బాలాజీ , గౌతమ్ రాజు, కరాటే కల్యాణి, శ్రీనివాసులు,పూజిత, జయవాణి, మాణిక్ తదితరులు ఉన్నారు.
Recommended Video
మా ఎన్నికల ఫలితాల తర్వాత నుండి కొనసాగుతున్న రాజీనామాల రగడ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ప్రకాష్ రాజ్ మా సభ్యుడిగా రాజీనామా చేశారు. తాను గెస్ట్ గా వచ్చానని గెస్ట్ గానే ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ప్రకాష్ రాజు రాజీనామా చేయొద్దని, మంచు విష్ణు అభ్యర్థించినట్టు కూడా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ప్రకాష్ ప్యానెల్ సభ్యులు కూడా రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం అయితే తాజాగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఇప్పటివరకు రాజీనామా చేయలేదా అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతవరకూ తమ వద్దకు రాజీనామా లేఖలు రాలేదన్న మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.