కడపలో ఉద్రిక్తత: కమిషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
అమరావతి: కడప జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాపులను బీసీల్లో చేర్చే విషయమై సోమవారం బీసీ సంఘాలు, కాపుల నుంచి మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇదే సమయంలో కాపులను బీసీల్లొ చేర్చొద్దని కోరుతూ, బీసీ కులాల రాష్ట్ర జేఏసీ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
జిల్లాలోని జడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. కాపులను బీసీల్లో చేర్చే అంశమై తమ వాదనలు స్వీకరించాలని, ఎట్టి పరస్థితుల్లోను కాపులను బీసీల్లో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకోవడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది.
కాగా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం జస్టిస్ మంజునాథ కమిషన్ ఆదివారం రాత్రే కడపకు చేరుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టం ప్రకారం, సర్వే ప్రకారం న్యాయం జరుగుతుందని, కడప జిల్లా ప్రజలు శాంతియుతంగా తమకు ఫిర్యాదులు, వినతులు ఇవ్వాలని సూచించారు.

ఎవరు కూడా ఎలాంటి భావోద్రేకాలకు తావివ్వద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి అందుకు అనుగుణంగా న్యాయం చేస్తామని అన్నారు. గతంలో బీసీ జాబితాలో చేర్చాలని 60 కులాలు దరఖాస్తులు చేసుకున్నాయని మరో 32 బీసీ కులాలు బీసీ జాబితాలోని ఒకరు బీ ఉపవిభాగం నుంచి ఏకు, సీ నుంచి ఏ కావాలని దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులను పరిశీలిస్తామని చెప్పారు. కమిషన్ విచారణతో పాటు ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేను కూడా పరిగణలోనికి తీసుకుంటామని ఆయన తెలిపారు. దీంతో పాటు కాపులను బీసీల్లో చేర్చడానికి అన్ని అర్హతులున్నాయా లేదా అనేది పరిశీలిస్తామని తెలిపారు.
సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా కూడా పలు అంశాలను పరిగణలోనికి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications