బ్రిటీషర్లను మించిన జగన్ సర్కార్ దోపిడీ-సింహాచలం భూముల స్కాంపై అశోక్ ఫైర్
విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఆడిట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పోరాడుతున్న ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇవాళ మరోసారి ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. తన అన్న ఆనంద గజపతి రాజు సమాధి వద్ద నివాళులర్పించిన అశోక్ గజపతిరాజు అనంతరం మాన్సాస్, సింహాచలం భూముల వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేశారు.
మాన్సాస్ ట్రస్టులో 16 ఏళ్ల పాటు ఆడిట్ జరగలేదని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని, కానీ మధ్య మధ్యలో ఆడిట్ చేశారని అశోక్ గజపతిరాజు వెల్లడించారు. అది అప్ డేట్ చేయలేదన్నారు. 17 ఏళ్లుగా ఆడిట్ చేయాల్సిందే ప్రభుత్వమేనని అశోక్ మరోసారి స్పష్టం చేశారు. మాన్సాస్ విద్యా సంస్థల్లో మాత్రం ఆడిట్ జరిగిందని ఆ వివరాలు ప్రభుత్వానికి సమర్పించామని అశోక్ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టు నుంచి ప్రభుత్వానికి ఏడాదికి పన్నుల రూపంలో 95 లక్షలు చెల్లిస్తున్నట్లు అశోక్ తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం సింహాచలం భూముల అక్రమాల ఆరోపణలపై స్పష్టత ఇవ్వడం లేదని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. సింహాచలం భూముల్లో సుమారు 700 ఎకరాలు అన్యాక్రాంతం అంటే చిన్న విషయం కాదని ఆయన తెలిపారు.
భూముల అన్యాక్రాంతంపై తమకు ఆధారాలు ఏమీ ఇవ్వడం లేదుని, కనీసం సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం లేదని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పై ఉద్దేశ్య పూర్వకంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తోందని, హిందూ దేవాలయాల భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేవాలయాల భూముల పర్యవేక్షణ కు అన్య మతస్తులను అధికారులుగా నియమిస్తున్నాని అశోక్ ఆరోపించారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఓ దొంగను సింహాచలం భూములకు చైర్మన్ చేశారని అశోక్ పేర్కొన్నారు. ఆ దొంగ సింహాచలం దేవస్థానం కు చెందిన 500 ఎకరాల భూములను తీసుకొని, వేరే చోట ప్రత్యామ్నాయంగా ఇస్తామని ప్రతిపాదనలు చేయడంపై అశోక్ మండిపడ్డారు సింహాచలం భూములకూ, ఇతర చోట్ల భూములకూ విలువలో ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇలాంటి దోపిడీ చేయలేదని అశోక్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications