మాన్సాస్ వివాదం..ట్రస్ట్ లో మొదలైన ఆడిటింగ్..మరోపక్క ఆ భూములపై విచారణ; సర్వత్రా ఉత్కంఠ !!
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ భూములపై గత కొద్ది రోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మాన్సాస్ మరియు సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజు నియామక ఉత్తర్వులు కొట్టివేసి అశోక్ గజపతి రాజుకు బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మాన్సాస్ ట్రస్ట్ లో కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగడం లేదని, పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అశోక్ గజపతిరాజును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తో పాటు, పలువురు వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మాన్సాస్ ట్రస్ట్ లో మొదలైన ఆడిటింగ్
ఇక తాజాగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ట్రస్ట్ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్ అధికారి ఆధ్వర్యంలో ఆడిటింగ్ మొదలైంది. విజయనగరం లోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఆడిట్ అధికారి హిమబిందు నేతృత్వంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన ఆడిట్ 2004 - 2005 సంవత్సరం నుంచి జరగాల్సి ఉందని ఆడిటింగ్ అధికారి పేర్కొన్నారు.
ఆడిటింగ్ కి సంబంధించి మొత్తం రికార్డులను అడిగామని, ప్రస్తుతానికి కొన్ని హార్డ్ కాపీలు మాత్రమే అందజేశారని, పూర్తి రికార్డులు ఇస్తేనే ఆడిట్ చేయగలుగుతాం అని ఆమె పేర్కొన్నారు. పూర్తి రికార్డుల కోసం మాన్సాస్ ట్రస్ట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

ట్రస్ట్ ఆడిటింగ్ పై ఆరోపణలు .. 16 సంవత్సరాల తర్వాత ఆడిటింగ్
16 సంవత్సరాల తర్వాత మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ జరుగుతుండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు కూడా ట్రస్టులో చాలా సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగడంలేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోను ఆడిటింగ్ పై వివరణ కోరారు. మాన్సాస్ సంస్థనుంచి చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై ఈ నెల 21వ తేదీ లోగా వివరాలు ఇవ్వాలని ఆయన ఈవో ను కోరారు. ఇదిలా ఉంటే దేవాదాయ శాఖకు సంస్థ చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై వివరాలు ఆడిట్ చేస్తే కాని తెలియదన్నారు ఆడిటింగ్ అధికారి హిమబిందు.

నిష్పక్షపాతంగా ఆడిటింగ్ రిపోర్టును తయారు చేస్తామన్న ఆడిటింగ్ అధికారి
ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత ట్రస్టు అధికారులదే అని పేర్కొన్న ఆమె, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ కోసం ట్రస్ట్ కు లేఖ రాయటం తమ విధి అని, ఆడిటింగ్ చేయించుకునే బాధ్యత మాత్రం ట్రస్టు దే అని తేల్చి చెప్పారు. మాన్సాస్ సంస్థ ఆడిటింగ్ కు సంబంధించిన నిష్పక్షపాతంగా ఆడిటింగ్ రిపోర్టును తయారు చేస్తామని ఆమె వెల్లడించారు. ఆడిటింగ్ లో పలు అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆడిటింగ్ పై ఆసక్తి నెలకొంది.
Recommended Video

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల అక్రమాలపై విచారనాదికారిని నియమించిన ప్రభుత్వం
ఇదిలా ఉంటే సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక విచారణాధికారి నియమించింది. విశాఖ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విచారణ అధికారిగా వ్యవహరించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఈ నెల 15వ తేదీ లోపు ఈ వివాదానికి సంబంధించి ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇక మాన్సాస్ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ఈవోలు విచారణ అధికారికి పూర్తిస్థాయిలో సహకరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications