ఆర్కే మరణించారా, బతికున్నారా: హైకోర్టులో ఆసక్తికరంగా...
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కె ఆచూకీపై న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమాచారం విషయంలో మావోయిస్టులను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని, వారికుండే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వారికి ఉంటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇంతకూ ఆర్కేను ప్రాణాలతో పట్టుకున్నారా, ఎన్కౌంటర్లో చనిపోయారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఆర్కే ప్రాణాలతో పట్టుబడి ఉంటే ప్రాణహాని తలపెట్టరనే కోర్టు బలంగా విశ్వసిస్తోందని కూడా వ్యాఖ్యానించింది.
పోలీసులు అక్రమంగా నిర్బంధించిన తన భర్తను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య కందుల శిరీష సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదనలు ఇలా జరిగాయి. ఫోటోలు అర్కె, ఆయన భార్య శిరీషవి...
ఆర్కె పోలీసుల అదుపులోనే ఉన్నాడని...
ఎన్కౌంటర్లో ఆర్కే గన్మెన్ చనిపోయారని, తీవ్రంగా గాయపడ్డ ఆర్కే, మరికొందరి జాడ తెలియడం లేదని, వారిని ఏపీ పోలీసులే అక్రమంగా నిర్బంధించారని, చిత్రహింసలకు గురి చేసి మరో ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చూపే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ఆరోపిస్తూ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఆదేశించాలని కోరారు.
సంఖ్య తేల్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది
అక్టోబరు 23న ఒడిసా లోని మల్కన్గిరి జిల్లా పరిధిలో మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయనే వార్తలు వచ్చాయని, ఈ కాల్పుల్లో తొలుత 24 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారని, తర్వాత ఆ సంఖ్య 32గా తేల్చారని పిటిషనర్ తరపున న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు.
ఆ విషయం ఎలా చెప్పగలరు..
పిటిషనర్ల తరపు వాదనలు విన్న జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎంఎ్సకే జైస్వాల్లతో కూడిన హైకోర్టు బెంచ్ వారు పోలీసుల అదుపులోనే ఉన్నారని మీరెలా చెప్పగలగుతున్నారని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ మృతుల్లో ఆర్కే గన్మెన్, ఆయన కుమారుడు మున్నా ఉన్నారని, ఈ విషయాన్ని పోలీసులే నిర్ధారించారని న్యాయవాది రఘునాథ్ తెలిపారు. ఆర్కేతోపాటు మరికొంతమంది మావోయిస్టులను పోలీసులు నిర్బంధించారని ఆ పార్టీ ఒక బహిరంగ లేఖ ద్వారా ప్రకటించిందని తెలిపారు.
ఎపిలో జరగలేదు, ఒడిషాలో...
పిటిషనర్ల తరపు వాదనలు హైకోర్టు ఏపీ స్పెషల్ జీపీ రమేశ్ వివరణ కోరింది. ఎన్కౌంటర్ ఏపీ పరిధిలో జరగలేదని, ఒడిషాలోని మల్కన్గిరి జిల్లా పరిధిలో జరిగిందని, ఎన్కౌంటర్కు ముందురోజు నుంచే అక్కడ సెల్ఫోన్ సిగ్నల్ నిలిపేశారని, తప్పించుకుపోయినవారి ఆచూకీ తమకు తెలియదని రమేశ్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలోనే, సమాచారం విషయంలో మావోయిస్టులను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎవరనేది కాదు, ప్రాణాలు ముఖ్యం...
పరిస్థితి తీవ్ర కల్లోలంగా ఉందని, అన్నిటికన్నా మనిషి ప్రాణాలు చాలా ముఖ్యమని, అతను మావోయిస్టా.. మరొకరా అనేది అప్రస్తుతమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాణాలకు తగిన రక్షణ కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమని హితవు పలికింది.