వైసీపీ నేతలకు మావోల టెన్షన్ .. పరిషత్ ఎన్నికల పరేషాన్ , ఏజెన్సీ గ్రామాల్లో తిరగాలంటేనే భయం
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ గ్రామాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. మావోల కదలికలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాయి. అంతేకాదు ప్రజాప్రతినిధులను పోలీసులు బయట తిరిగవద్దని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో టెన్షన్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలలో తాజా పరిస్థితులు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా తయారయ్యాయి. చత్తీస్గడ్ నుండి ఏపీ సరిహద్దుల్లో కి మావోయిస్టులు వచ్చారన్న ప్రచారం ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు బయట తిరగవద్దంటూ సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో తాజా పరిణామాలతో టెన్షన్ మొదలైంది .

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ తర్వాత బోర్డర్ లో మావోల అలజడి .. అధికార పార్టీ నేతలకు భయం
ఛత్తీస్గడ్ లో మావోయిస్టుల మారణహోమం సృష్టించిన ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇక మావోలు ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో ఉన్నారన్న సమాచారంతో అటవీప్రాంతాలను గాలిస్తున్నారు . ఇక ఇదే సమయంలో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు అధికార పార్టీకి టెన్షన్ తెప్పిస్తున్నాయి. స్థానిక ఎన్నికల కోసం అధికార పార్టీ వ్యూహాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అడుగులు వేస్తుంది. పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయాలని ఈ ఎన్నికల్లో సైతం విజయబావుటా ఎగురవేయాలని దృష్టిసారించింది.

ప్రజా ప్రతినిధులు బయట తిరగవద్దని పోలీసుల హెచ్చరికలు
అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయిన ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రం ప్రజా ప్రతినిధులు బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహించలేని స్థితి వారిని ఇబ్బంది పెడుతుంది. ఒకపక్క పోలీసులు బయట తిరగవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేయడం, మరోపక్క ఇప్పుడే పరిషత్ ఎన్నికలు జరుగుతుండడం వారిని దిక్కుతోచని స్థితిలో పడేసింది.

ప్రచారం చెయ్యలేక , సైలెంట్ గా ఉండలేక భయం గుప్పిట్లో అధికార వైసీపీ నేతలు
గతంలో పంచాయతీ ఎన్నికలను మావోయిస్టులను బహిష్కరించడం , అప్పుడు పోటీలో ఉన్న ఒక అభ్యర్థిని తీవ్రంగా కొట్టడం, ఆ తర్వాత టిడిపి హయాంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను దారుణంగా కాల్చి చంపడం వంటి ఘటనలు ఏపీ ఏజెన్సీ రాజకీయ నాయకులు మరచిపోరు. ఇక తాజా పరిణామాలు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కు కారణం గా మారింది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేక, అలాగని సైలెంట్ గా ఇంట్లో కూర్చోలేక దినదినగండంగా వైసిపి నేతల పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications