కేసీఆర్ను పిలిచి జగన్ దావత్ ఇస్తే మనసు మారుతుందేమో : కృష్ణా జలాలపై ఎంపీ టీజీ వెంకటేష్
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం పరిష్కారం కావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని మొదటినుంచి వాదిస్తోంది తెలంగాణ సర్కార్. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నీటి లెక్క తేలుతుందా.. అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీపై ఆసక్తి
కృష్ణా మిగులు జలాలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటి ? ప్రశ్నించిన టీజీ వెంకటేష్
కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల నీటి లెక్కలు తేల్చడానికి ఈనెల 28వ తేదీన కృష్ణా రివర్ బోర్డు భేటీ కానుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం , ఏపీ నీటి వినియోగం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. కృష్ణా మిగులు జలాలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ ని పిలిచి జగన్ దావత్ ఇవ్వాలి .. అప్పుడైనా కేసీఆర్ మనసు మారుతుందేమో అంటూ సెటైర్ వేశారు.
ప్రత్యేక హోదా సాధ్యం కాదు ... మూడు రాజధానులు ఇప్పట్లో లేదు
తెలంగాణ మిగులు జలాలను వాడుకోవచ్చు కాని రాయలసీమ వాడుకోవద్దా అని ప్రశ్నించిన టీజీ వెంకటేష్ ఏపీలో కొందరు అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల విషయం పై కూడా మాట్లాడిన టీజీ వెంకటేష్ మూడు రాజధానులు ఏర్పాటు ఇప్పట్లో జరిగే అంశం కాదని, ఇక ప్రత్యేక హోదా కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్నది జగమెరిగిన సత్యం అని పేర్కొన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా జరిగే పని కాదు అంటూ స్పష్టం చేశారు.
Recommended Video
కనీసం ప్యాకేజీ తీసుకొని రాయలసీమ, ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయాలన్న ఎంపీ టీజీ వెంకటేష్
ఇంకా ప్రత్యేక హోదాను బూచిలా చూపుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం నుండి కనీసం ప్యాకేజీ తీసుకొని రాయలసీమ, ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కు టి.జి.వెంకటేష్ సూచించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగా సహకరిస్తున్నా కొందరు నేతలు నోరు జారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లులకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు , కార్యదర్శి అయిన హరికేష్ మీనా కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 28వ తేదీన భేటీ నిర్వహిస్తున్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.