ఒకే ఒక్కడు 'గోపీనాథ్'... ఆటో డ్రైవర్ కొడుకు... తెలుగు రాష్ట్రాలు గొప్పగా మాట్లాడుకునే స్థాయికి...
చదువే పేదల జీవితాలను వెలిగిస్తుంది... ఈ మాటకు అక్షర సత్యం గోపీనాథ్ అనే యువకుడు.విశాఖపట్నంకు చెందిన గోపీనాథ్ ఓ ఆటో డ్రైవర్ కుమారుడు. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కలగన్న గోపీనాథ్ ఇందుకు చదువునే నమ్ముకున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును వీడలేదు. సాధించాలన్న పట్టుదల,కృషితో ఇవాళ తెలుగు రాష్ట్రాలు అతని గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు. కొడుకు ఎదుగుదలను చూసి ఆ తల్లిదండ్రులు గుండెల నిండా గర్వంతో మురిసిపోతున్నారు. ఇంతకీ గోపీనాథ్ సాధించిన విజయమేంటి....

ఫ్లయింగ్ ఆఫీసర్గా గోపీనాథ్...
హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గత శనివారం(జూన్ 19) జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గోపీనాథ్ ఐఏఎఫ్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించాడు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన ఏకైక వ్యక్తి గోపీనాథ్ మాత్రమే కావడం విశేషం. దూర విద్య ద్వారానే డిగ్రీ,పీజీ పూర్తి చేసిన గోపీనాథ్... ఎప్పటికైనా ఆఫీసర్ పోస్టులో చేరాలనుకున్నాడు. ఇందుకోసం కష్టపడి చదివి ఎస్ఎస్సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్)లో అర్హత సాధించి ఐఏఎఫ్లో క్రిప్టోగ్రాఫర్ పోస్టుకు ఎంపికయ్యాడు.

గోపీనాథ్ నేపథ్యం...
విశాఖపట్నంకు చెందిన గోపీనాథ్ తండ్రి సూరిబాబు. ఆయనో సాధారణ ఆటో డ్రైవర్. 25 ఏళ్లుగా అదే వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేద కుటుంబం కావడంతో గోపీనాథ్ను చదివించడానికి సూరిబాబు చాలానే కష్టపడ్డారు. నిజానికి గోపీనాథ్ను ఇంజనీరింగ్ చదివించాలని సూరిబాబు భావించారు. ఇందుకోసం బ్యాంకు రుణం తీసుకోవాలనుకున్నారు. కానీ తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న గోపీనాథ్... ఇంజనీరింగ్లో చేరడం కంటే దూర విద్య ద్వారానే చదువు పూర్తి చేయాలనుకున్నాడు. అదే సమయంలో ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఐఏఎఫ్లో ఎయిర్మ్యాన్ పోస్టుకు ఎంపికయ్యాడు. అందులో ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్లోని డా.వీఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ,ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశాడు. అటు ఉద్యోగం,ఇటు దూర విద్య రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు.

గోపీనాథ్ ఏమంటున్నారు...
ఎస్ఎస్సీలో అర్హత సాధించడంతో ఐఏఎఫ్లో క్రిప్టోగ్రాఫర్గా గోపీనాథ్ ప్రమోట్ అయ్యాడు.అలా ఎప్పటికైనా ఆఫీసర్ కావాలన్న గోపీనాథ్ కల నెరవేరింది. తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి... చదువునే నమ్ముకుని తన లక్ష్యాన్ని చేరుకున్నాడు గోపీనాథ్. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు పట్టుదలతో,కృషితో ఈ స్థాయికి చేరుకోవడం స్పూర్తిదాయకం అనడంలో అతిశయోక్తి లేదు. తన కల నెరవేరడంపై గోపీనాథ్ మాట్లాడుతూ..'నాకోసం నా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. వారి కోసం నేనేదైనా చేయాలనుకున్నా. వారిని గర్వపడేలా చేయాలని భావించా.' అని పేర్కొన్నారు. నిజాయితీగా కష్టపడితే మీ కలలు తప్పక నెరవేరుతాయని గోపీనాథ్ తెలిపారు. గోపీనాథ్ ఇప్పుడు ఆయన తల్లిదండ్రులే కాదు తెలుగు రాష్ట్రాలు గొప్పగా మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు.












Click it and Unblock the Notifications