పట్టాలెక్కిన మెట్రో రైలు: నాగోల్ నుండి ట్రయల్ రన్
హైదరాబాద్: హైదరాబాదు మెట్రో రైలు పట్టాలెక్కింది! గురువారం నాగోల్ నుండి సర్వే ఆఫ్ ఇండియా వరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మెట్రో రైలు తొలిసారి ట్రాక్ పైకి ఎక్కింది. నాగోలు మెట్రో డిపో నుండి సర్వే ఆఫ్ ఇండియా వరకు ఈ ట్రయల్ చెక్ చేశారు.
కీలోమీటరు వరకు ట్రాక్, కోచ్ పని తీరును అధికారులు పరిశీలించారు. ప్రయోగాత్మకంగా తొలిసారి ట్రాక్ పైకి మెట్రో రైలును ఎక్కించారు. ఇంజిన్, మూడు బోగీలతో ఈ టెస్ట్ రన్ నిర్వహించారు. కాగా, ట్రయల్ రన్కు ముందు అధికారులు ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్ మెట్రోరైలు దేశంలోని ఇతర మెట్రో రైలు నిర్మాణ పనుల రికార్డులను అధిగమించిన విషయం తెలిసిందే. కేవలం 20 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 27 కిమీ పొడవున 1000 వయోడక్ట్లను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి పది రోజుల క్రితం ప్రకటనలో తెలిపారు.
ముంబై మెట్రో రైలు నిర్మాణ పనుల్లో 11 కిమీ పనులను పూర్తి చేయడానికి ఏడేళ్లు, బెంగళూరు, చెన్నై మెట్రో రైలు నిర్మాణ పనుల్లో 25 కిమీ పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టిందని చెప్పారు. అయితే హైదరాబాద్ మెట్రో రైలు పనుల్లో 27 కిమీ పరిధిలో వెయ్యి వయోడక్ట్లను కేవలం 20 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్టు ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
తమది దేశంలోని ఇతర మెట్రో రైలు పనులతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో రైలు పనులు రికార్డులను బద్ధలు కొట్టినట్టుగా చెప్పారు. హబ్సీగూడ జన్పాక్ట్ సమీపంలో 2012లో తొలి వయోడక్ట్ను ఏర్పాటు చేయగా, 1000వ వయోడక్ట్ను ఆదివారం ఎస్ఆర్ నగర్లో బిగించినట్టు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 1473 పునాదులను (56శాతం), 1370 స్తంభాలను (52శాతం) పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. మెట్రో రైలు పనులకుగాను ఉప్పల్లో 70 ఎకరాల విస్తీర్ణంలో, కుత్బుల్లాపూర్లో 62 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ఫ్రీకాస్ట్ యార్డులు ఏర్పాటు చేసినట్టు ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
నిర్మాణ పనుల్లో ముఖ్యమైన వయోడక్ట్లను (ఒకొక్కటీ 40 టన్నులు) బరువైన వాటిని ఫ్రీకాస్ట్ యార్డుల్లో తయారు చేసి పాదచారులకు, వాహనదారులకు అసౌకర్య కలగకుండా రాత్రి వేళల్లో ట్రాక్పైకి బిగిస్తోన్నట్టు ఆయన తెలిపారు.
నిర్మాణ పనుల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను హైదరాబాద్ మెట్రో రైలు దక్కించుకుందని తెలిపారు. ‘ది గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్- 2013' అవార్డుతోపాటు, రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఆక్సిడెంట్స్ అవార్డ్స్ 2013, 2014 అవార్డులు కూడా తమకు వచ్చినట్టు ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండి విబి గాడ్గిల్ చెప్పారు.