ఇంటర్ ఫెయిలైన పవన్ కూడా చదువు గురించి మాట్లాడతాడా?: మంత్రి సురేష్ ఫైర్!!
ప్రభుత్వం మారిన తర్వాత... వైసీపీ ప్రభుత్వ విద్యా శాఖ కుంభకోణాలపై దృష్టి సారిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ జైలుకి పంపుతాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని, ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు.
ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కోసం ఇన్ని వేల కోట్ల ఖర్చు అవసరమా? అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ విద్యా వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్ ఇచ్చారు.

ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ కూడా చదువు గురించి మాట్లాడుతున్నారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పవన్ ఇంగ్లీషులో మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. ఐక్యరాజ్యసమితి వేదికపై పేద విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం పై ఆరోపణలు పవన్ కళ్యాణ్ అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు.
ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పైన, నారా లోకేష్ పైన నిప్పులు చెరిగిన మంత్రి ఆదిమూలపు సురేష్ టిడిపి, నారా లోకేష్ లకు భవిష్యత్ లేదన్నారు. టిడిపి కార్యకర్తలపై కేసులు పెడితే 48 గంటల్లో విడిపిస్తానని చెప్పిన లోకేష్ మాటలు గుర్తుచేస్తూ, లోకేష్ చంద్రబాబు జైలుకు వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు విడిపించ లేకపోయారు అంటూ, ఎందుకు బెయిల్ తీసుకురాలేకపోయారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.
పాపం పండి చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ లకే గ్యారెంటీ లేదని వారు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు .యువగళం పాదయాత్ర లోకేష్ ఎందుకు ఆపేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ యాత్ర చేసిన ప్రజలు వారిని గుర్తించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications