'అఖిల.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా?, పోలింగ్ రోజే!'
అఖిలప్రియ మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది.
నంద్యాల: ఉపఎన్నిక వేళ టీడీపీ నేతలు యథేచ్చగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి భూమా అఖిల ప్రియ వార్డుల్లో కలియతిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనల ప్రకారం ఈరోజు నంద్యాలలో తిరగకూడదన్న ఆంక్షలు ఉన్నప్పటికీ.. అఖిలప్రియ మాత్రం వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇది 'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం' చేసే చర్య అని మండిపడుతున్నారు. అంతేకాదు, అఖిలప్రియ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా లేవని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక గాంధీనగర్ వార్డులో ఏకంగా ముక్కు పుడకల పంపిణీతో టీడీపీ నేతలు ప్రలోభాలకు దిగారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఓవైపు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు ప్రలోభ పర్వం కొనసాగడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రలోభాలను అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.