ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ.. బాలకృష్ణకు అంబటి రాంబాబు వార్నింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకపక్క చంద్రబాబు అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు నేడు అసెంబ్లీ వేదికగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పై కేసును విత్ డ్రా చేసుకోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో వైసిపి వర్సెస్ టిడిపి అన్నట్టుగా పరిస్థితి మారింది.
నేడు అసెంబ్లీలో టిడిపి హిందూపురం ఎమ్మెల్యే సినీహీరో నందమూరి బాలకృష్ణ మీసాలు మెలి పెట్టడం, తొడగొట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్పీకర్ టిడిపి సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయగా.. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన బాలయ్య తనను అంబటి రాంబాబు రెచ్చగొట్టారంటూ వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు సభలో మీసం మెలేసి తొడ కొట్టాడని, తన వృత్తిని అవమానించాడని, సినిమాల్లో చూసుకోమన్నాడని బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

రా చూసుకుందామని అంబటి అంటేనే, తాను కూడా రా చూసుకుందాం అని అన్నానని, తాను ముందుకు వచ్చేసరికి బిత్తర పోయారని వ్యాఖ్యానించాడు నందమూరి బాలకృష్ణ. జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని , టిడిపి ఇలాంటివి ఎన్నింటినో చూసిందని పేర్కొన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందనే భ్రమలో వైసిపి ఉందని బాలకృష్ణ మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం కూడా రోడ్లమీదకు వచ్చే రోజులు ముందు ఉన్నాయని హెచ్చరించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు గా జగన్ పరిస్థితి ఉందని ఆయన జగన్ పై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు, మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ.. నాది తెలుగు గడ్డ అంటూ తనదైన శైలిలో బాలకృష్ణ కు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ భయపెడితే తాను భయపడే రకం కాదని తాను కాపు బిడ్డ అని చెప్పిన అంబటి రాంబాబు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications