ఏపీలో విద్యుత్ మీటర్ల రగడ: రైతులపై ఒక్క రూపాయి భారం పడినా రాజీనామా చేస్తానన్న మంత్రి
ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నేడు ఏపీ క్యాబినెట్ లో దీనిపైన ప్రధానంగా చర్చ జరగనుంది. రైతులకు ఉచిత విద్యుత్ బదులుగా,మీటర్లు బిగించి విద్యుత్ వినియోగానికి తగినట్లుగా నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు జరుగుతున్నాయి. రైతులపై అదనపు భారం వేయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు.
రైతులపై ఒక్క రూపాయి భారం పడినా రాజీనామా చేస్తా : మంత్రి బాలినేని
ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న ట్లుగా ఉచిత విద్యుత్ కు సంబంధించి రైతులపై ఒక రూపాయి భారం పడినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి బాలినేని ప్రకటించారు. సీఎం జగన్, చంద్రబాబులా కాదని ఆయన అన్నారు . రైతులపై కాల్పులకు ఆదేశించిన ఘనత చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ను అవహేళన చేశారని గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని, ముప్పై ఏళ్ల పాటు నిర్విఘ్నంగా వైయస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించడానికి కంకణబద్ధులై ఉన్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వమే బిల్లులను చెల్లిస్తుంది. మీటర్లు కేంద్ర సంస్కరణల్లో భాగమే
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ విషయంలో ఒక్క పైసా కూడా కట్టనవసరం లేదని, ప్రభుత్వమే ఆ విద్యుత్ బిల్లులను చెల్లిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మీటర్లు ఇస్తున్నామని పేర్కొన్న మంత్రి, కేంద్రం నాలుగు రంగాల్లో నగదు బదిలీ తెచ్చిందని, అందులో భాగంగానే నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోందని చెప్పారు.
నేరుగా రైతుల ఖాతాల్లోకే విద్యుత్ బిల్లుల నగదు
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కరెంట్ బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయిన తర్వాతనే బిల్లులు చెల్లిస్తారు అంటూ పేర్కొన్నారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తున్న కారణంగా, విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలు ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి నిధులు కావాలని అధికారులను అడిగితే వెంటనే 1700 కోట్ల రూపాయలను మంజూరు చేశారని చెప్పారు.
ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం
అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదని బాలినేని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని, రైతు సంక్షేమం పై ఏపీ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఒక్క రూపాయి అదనపు భారం పడినా తాను రాజీనామా చేస్తానని బాలినేని సవాల్ విసిరారు.