సీఎం జగన్ కూడా అదే చెప్పారు??
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలను గెలుచుకోవాలనుకోవడం అత్యాశ అవదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక స్థానం పోయినా పర్వాలేదు అనుకున్నామంటే ఆ ఒక్కటి కాస్తా 10 స్థానాలకు పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లోటుపాట్లనీ ముఖ్యమంత్రి జగన్ వివరించారన, మంత్రులు శాఖాపరమైన సమీక్షలు ఎలా చేస్తారో పార్టీపరంగా సమీక్ష చేశారన్నారు.
ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపే అవుతుందని, ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారన్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల్లోకి వారసులను తీసుకువచ్చే అంశంపై మాట్లాడుతూ అందరికీ వారసులు ఉంటారని, తనకు కూడా అబ్బాయి ఉన్నాడని, ఎవరైనా వారసులను దించొచ్చని.. కానీ ప్రజలు ఆమోదించాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దానిపై బొత్స మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. సమావేశం సందర్భంగా జగన్ పూర్తిస్థాయి సమీక్ష చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించడంలేదని, ఇకనుంచి వారానికి నాలుగు రోజులు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీచేశారు.
అంతేకాకుండా వారిపై తనకు ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలవలేరు అనుకుంటే వారికి సీట్లిచ్చేదిలేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఎవరెవరు పనిచేయడంలేదో, ఎవరెవరు నియోజకవర్గాల్లో పర్యటించడంలేదో.. తాను తెప్పించుకున్న తదితర వివరాలన్నింటినీ వారికి చదివి చెప్పారు. ఆరునెలలకు ముందే అభ్యర్థులను ఖరారు చేస్తున్నానని, నియోజకవర్గంలో తమకు బదులుగా తమ కుమారులు తిరుగుతున్నారంటే కుదరదని తేల్చిచెప్పారు.